రాష్ట్రానికి తప్పిన ఆహార ఇబ్బందులు

9 Aug, 2020 05:38 IST|Sakshi

ఉచిత బియ్యం పంపిణీతో గోదాములన్నీ ఖాళీ 

అదనపు కేటాయింపులపై విజ్ఞప్తి చేసినా స్పందించని కేంద్రం 

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఆహార ఇబ్బందులు తప్పాయి. రబీలో ఆశించిన మేరకు ధాన్యం దిగుబడి రావడంతో ప్రజా పంపిణీ వ్యవస్థ సవ్యంగా సాగింది. రబీలో రికార్డు స్థాయిలో 31.48 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల నుంచి సేకరించింది. కరోనా కారణంగా పనులు లేక ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం నెలకు రెండు విడతలుగా బియ్యంతో పాటు కందిపప్పు లేదా శనగలు ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.  

► రాష్ట్రంలో ప్రస్తుతం 1,49,20,706 కార్డులు ఉన్నాయి. వీటిలో జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోనివి 89 లక్షలకు పైగా, ఆ చట్టం పరిధిలోకి రానివి 60 లక్షల వరకు ఉన్నాయి.  
► ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే కార్డుదారులకే కేంద్రం బియ్యం ఇస్తోంది. మిగిలిన కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వమే పంపిణీ చేస్తోంది.  
► ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఆహార భద్రతా చట్టం పరిధిలోకి రాని కార్డుదారులకు పంపిణీతో రాష్ట్రంపై రూ.800 కోట్లు అదనపు భారం పడింది.  
► జూలై నుంచి నవంబర్‌ వరకు ఉచితంగా బియ్యం ఇస్తామని కేంద్రం ప్రకటనతో రాష్ట్రంపై మరో రూ.1,663 కోట్ల అదనపు భారం పడనుంది. 
► ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 7 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ఉండాల్సిన బఫర్‌ స్టాకూ వాడేశారు.  కనీసం 15.05 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని అదనంగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రం స్పందించనేలేదు.  

రబీ ధాన్యమే ఆదుకుంది... 
నెలకు రెండు సార్లు పంపిణీతో ఆఖరు బఫర్‌ స్టాకునూ వాడుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అదనంగా కేటాయించాలని కేంద్రానికి లేఖ రాశాం.  రైతుల నుంచి రబీలో కొనుగోలు చేసిన ధాన్యమే ప్రస్తుతం ఆదుకుంటోంది. 
– కోన శశిధర్, ఎక్స్‌ అఫిషియో కార్యదర్శి, పౌరసరఫరాల శాఖ  

మరిన్ని వార్తలు