డీఎస్సీకి ఎంపికైన ఎమ్మెల్యే ధర్మశ్రీ

21 Jun, 2022 07:32 IST|Sakshi

1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థుల జాబితాలో పేరు

చోడవరం: రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ 1998 డీఎస్సీలో ఎంపికయ్యారు. రాజకీయాల్లోకి రాకముందు.. సుమారు పాతికేళ్ల క్రితం ధర్మశ్రీ డీఎస్సీ రాసి అర్హత సాధించారు. ఇన్నాళ్లకు ఆయనకు టీచర్‌గా ఉద్యోగావకాశం వచ్చింది. ఈ విషయమై ఆయనను కదిలించగా.. ‘అప్పుడు నా వయసు సుమారు 30 ఏళ్లు. మద్రాసు అన్నామలై యూనివర్సిటీలో బీఈడీ చదివాను. ఉపాధ్యాయునిగా స్థిరపడాలనుకున్నాను.

1998 డీఎస్సీ రాశాను. అర్హత సాధించినా అది  పెండింగ్‌లో పడటంతో న్యాయవిద్య (బీఎల్‌) చదవడం ప్రారంభించాను. ఆ సమయంలోనే రాజకీయ అరంగేట్రం చేసి కాంగ్రెస్‌ పార్టీ జిల్లా యువజన విభాగంలో క్రియాశీలకంగా వ్యవహరించాను. ఈ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అనుచరునిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని, ఈ రోజు వైఎస్సార్‌సీపీలో సముచిత స్థానంలో ఉన్నాను. అప్పుడే ఉద్యోగం వస్తే రాజకీయాల కంటే ఉపాధ్యాయ వృత్తికే ప్రాధాన్యం ఇచ్చేవాడిని. సీఎం జగన్‌మోహనరెడ్డి తీసుకున్న చొరవ వల్ల పాతికేళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయుల స్వప్నం నెరవేరింది. ముఖ్యమంత్రికి డీఎస్సీ 1998 బ్యాచ్‌ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా’ అన్నారు. 

మరిన్ని వార్తలు