కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష.. కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే

1 Nov, 2022 12:25 IST|Sakshi

సాక్షి, కోవూరు: తనను నమ్ముకొన్న కార్యకర్తల కుటుంబాలకు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అండగా నిలిచారు. కార్యకర్తలు తన కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు గ్రామానికి చెందిన యాట అశోక్, చల్లాయపాళెం గ్రామానికి చెందిన అత్తిపాటి గోపి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఇటీవల అకాల మరణం చెందారు.

అశోక్‌కుమార్‌ కుటుంబానికి రూ.లక్ష నగదు అందజేస్తున్న ఎమ్మెల్యే ప్రసన్న

పార్టీని, తనను నమ్ముకున్న ఆ కార్యకర్తల కుటుంబాలను ఎమ్మెల్యే ప్రసన్న సోమవారం పరామర్శించి, ఒక్కొక్క కుటుంబానికి రూ.లక్ష వంతున నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి చారిటబుల్‌ ట్రస్టు ద్వారా సాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు బాధను తెలుసుకుంటూ ప్రసన్న కంటనీరు పెట్టుకున్నారు. ఆయన కంట కన్నీరు గమనించిన పార్టీ నేతలు సైతం భావోద్వేగానికి గురయ్యారు. తనను నమ్ముకున్న కార్యకర్తల కోసం ఎందాకైనా వెళ్లే మనస్తత్వం ఎమ్మెల్యే ప్రసన్నది అని పలువురు చర్చించుకున్నారు. ఎమ్మెల్యే వెంట వవ్వేరు బ్యాంకు చైర్మన్‌ సూరా శ్రీనివాసులురెడ్డి, నాయకులు యర్రంరెడ్డి గోవర్ధన్‌ రెడ్డి, మండల కన్వీనర్‌ సతీష్‌ రెడ్డి, వెంకయ్య, శేషు, చరణ్, మస్తాన్‌ ఉన్నారు.       

మరిన్ని వార్తలు