సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నిసా గుండెపోటుతో శుక్రవారం అర్థరాత్రి మృతి చెందారు. శాసనమండలి సమావేశానంతరం ఇంటికి వచ్చిన ఆమె రాత్రి 11.30 గంటల సమయంలో ఛాతిలో నొప్పి వస్తోందని చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రెండు హాస్పటల్స్కు తరలించినా ఫలితం లేకపోయింది.
వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి కరీమున్నీసా పార్టీకోసం నిరంతరం శ్రమించారు. ఈ ఏడాది ఎమ్మెల్సీగా ఆమెకు సీఎం జగన్ అవకాశం కల్పించారు. శుక్రవారం ఉదయం శాసనమండలిలో ఆమె సీఎం జగన్, శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజును కలిశారు. కరీమున్నీసాకు భర్త, ఐదుగురు కుమారులు ఉన్నారు.
సీఎం వైఎస్ జగన్ సంతాపం
► ఎమ్మెల్సీ కరీమున్నీసా హఠాన్మరణం పట్ల సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘ నా సోదరి మహ్మద్ కరీమున్నీసా ఆకస్మిక మరణం తీవ్రంగా కలిచివేసింది. నిన్న శాసనమండలికి హాజరై రాత్రి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించడం బాధాకరం. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. వారికి నాతో సహా పార్టీ అండగా ఉంటుంది’ అని ట్విటర్ ద్వారా పేర్కొన్నారు.
నా సోదరి మహ్మద్ కరీమున్నీసా ఆకస్మిక మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. నిన్న శాసనమండలికి హాజరై రాత్రి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించడం చాలా బాధాకరం. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. వారికి నాతో సహా పార్టీ అండగా ఉంటుంది.
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 20, 2021