లోను బదులు గ్రాంట్ ఇవ్వండి: మోపిదేవి

19 Sep, 2020 10:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఫిషింగ్ హార్బర్లకు ఫిషరీస్‌, ఆక్వాకల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌(ఎఫ్‌ఐడీఎఫ్‌)లోను బదులుగా తగిన గ్రాంట్ ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ కేంద్రాన్ని కోరారు. శనివారం ఆయన రాజ్యసభ జీరోఅవర్‌లో మాట్లాడారు. అనుమతులు జారీ చేసిన మూడు ఫిషింగ్‌ హార్బర్లకు లోను బదులు గ్రాంట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత, మిగిలినటువంటి విభజిత ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ లోటు ఎక్కువగా ఉండటం, కోవిడ్-19 ప్రభావముంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని తెలిపారు. అయినప్పటికీ భారతదేశంలోనే ఆక్వా రంగంలో ముందుండి, విదేశీ మారక ద్రవ్యాన్ని సమపార్జించడంలో ఏపీ మొదటి స్థానంలో ఉందని వివరించారు. (రాజ్యసభలో విశాఖ వాణి)

ఏపీకి సంబంధించి ఇప్పటికే అనుమతులు మంజూరు చేసినటువంటి మూడు ఫిషింగ్ హార్బర్లు నిజాంపట్నం(ఫేస్-2) అంచనా వ్యయం రూ. 379.17 కోట్లు, మచిలీపట్నం(ఫేస్-2) అంచనా వ్యయం రూ.285.609 కోట్లు, ఉప్పాడ అంచనా వ్యయం రూ. 350.44కోట్లకు భారత ప్రభుత్వ వాటా క్రింద ఒక్కొక్కదానికి రూ.150 కోట్లు మంజూరు చేసింది. అంటే రూ.450కోట్లు ఎఫ్‌ఐడీఎఫ్‌ రుణంగా కాకుండా, మొత్తం గ్రాంటు రూపంలో మార్పులు  చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సిదిగా ఎంపీ రాజ్యసభలో కేంద్రాన్ని కోరారు. (ఐదేళ్లలో సాగునీటి కోసం రూ. లక్ష కోట్లు)

మరిన్ని వార్తలు