తప్పుడుదారిలో స్థలాలు తీసుకోవటం చంద్రబాబుకే చెల్లింది

21 Dec, 2022 04:55 IST|Sakshi
మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు, ఎమ్మెల్యే కోన రఘుపతి

సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మించారు 

నిబంధనల ప్రకారమే బాపట్లలో వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి స్థలం కేటాయింపు 

‘ఈనాడు’ తప్పుడు కథనాలకు బెదిరేదిలేదు 

ఎంపీ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణారావు 

బాపట్ల: తప్పుడుదారిలో స్థలాలను తీసుకోవటం, సుప్రీంకోర్టు స్టేలో ఉన్న స్థలంలో సైతం పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవటం, దళితులు నివసిస్తున్న భూములను లాక్కుని పార్టీ కార్యాలయం నిర్మించడం చంద్రబాబునాయుడుకే చెల్లుతుందని ఎంపీ, వైఎస్సార్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణారావు ధ్వజమెత్తారు. వాటిని దగ్గరుండి ప్రోత్సహించే ఈనాడు రామోజీరావు కళ్లకు ఆనాడు ఆ తప్పుడు పనులే కనిపించలేదని ఎద్దేవా చేశారు.

బాపట్లలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యాలయాలకు స్థలాలను కేటాయించే విధంగా 21–02–2016వ తేదీన జీవో నంబరు 340 ఇచ్చారని గుర్తుచేశారు. ఆ జీవోకు అనుగుణంగా బాపట్లలోని పరిశ్రమలశాఖ నుంచి ఆర్టీసీకి కేటాయించగా వారు నిరుపయోగంగా ఉంచటంతో పలుసార్లు నోటీసులు ఇచ్చి స్వాధీనం చేసుకున్న స్థలాన్ని మాత్రమే కేటాయించమని కోరినట్లు చెప్పారు.

ఈ మేరకు పరిశ్రమలశాఖ, రెవెన్యూశాఖ స్వాధీనం చేసుకున్న భూమిని పార్టీ కార్యాలయానికి కేటాయిస్తూ క్యాబినెట్‌ తీర్మానం చేసిన తరువాతే స్వాధీనం చేసుకుని పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. చంద్రబాబునాయుడు 1997లో జూబ్లీహిల్స్‌లో కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని ఎన్టీఆర్‌ భవన్‌ పేరుతో అద్దెకు తీసుకుని ఆయన్ని పరలోకానికి పంపి ఆభూమిని అన్యాక్రాంతం చేశారని గుర్తుచేశారు. మంగళగిరిలో జాతీయరహదారి పక్కనే కోట్లాది రూపాయిల విలువైన భూమిని పార్టీ కార్యాలయానికి కేటాయించుకోగా సుప్రీంకోర్టు కూడా స్టే ఇచ్చిందని చెప్పారు.

స్టేని సైతం లెక్కచేయకుండా చంద్రబాబు పార్టీ కార్యాలయం నిర్మించుకున్న విషయం రామోజీరావుకు కనిపించలేదా అని ప్రశ్నించారు. గుంటూరులో విలువైన పిచ్చుకులకుంటలో 1,500 గజాలకు మరో 100 గజాలు ఆక్రమించుకుని పార్టీ కార్యాలయం నిర్మించడం, శ్రీకాకుళంలో దళితుల భూములను లాక్కుని పార్టీ కార్యాల­యం నిర్మించడం, విశాఖపట్నంలో 2,500 గజాల విలువైన భూమి స్వాధీనం వంటివి ఈనాడుకు కనిపించలేదా అని ప్రశ్నించారు.

మార్గదర్శి చిట్‌ఫండ్‌ కంపెనీపై సీబీసీఐడీ విచారణ జరుగుతుంటే విచా­రణకు ఎందుకు సహకరించలేదని నిలదీశారు. రికా­ర్డుల్లో తప్పులుండటం వల్లనే సీబీసీఐడీకి రికార్డులు చూపించటంలేదని చెప్పారు. ఇప్పటికైనా నిబంధనలకు విరుద్ధంగా ఏంజరుగుతుందో గమనించి మాట్లాడాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాశరావు, నాయకుడు చేజర్ల నారాయణరెడ్డి పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు