కుటుంబ కలహాలతో తల్లీకూతురు ఆత్మహత్య 

22 May, 2021 08:54 IST|Sakshi
ఆత్మహత్య చేసుకున్న వీరమ్మ 

ధర్మవరం అర్బన్‌: కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన మేరకు.. చెన్నేకొత్తపల్లి మండలం గొల్లవాండ్లపల్లికి చెందిన గోపి కొన్నేళ్ల క్రితం ధర్మవరానికి వలస వచ్చాడు. శ్రీలక్ష్మీచెన్నకేశవపురంలో నివసిస్తూ రంగుల అద్దకం ఫ్యాక్టరీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే గోపి జూదానికి బానిసై దొరికినచోటల్లా అప్పులు చేశాడు.

అప్పులు తీర్చేందుకు ఉన్న ఇంటిని కూడా బేరం పెట్టి రూ.2 లక్షలు అడ్వాన్స్‌ తీసుకున్నాడు. విషయం తెలుసుకున్న భార్య వీరమ్మ (38) ఇంటిని అమ్మేస్తే పిల్లల భవిష్యత్తు ఏమిటని గోపిని నిలదీసింది. అయినా అతని ప్రవర్తనలో ఏమాత్రం మార్పు లేకపోవడంతో మనస్తాపం చెందిన వీరమ్మ తన కుమార్తె దీపిక(9)తో కలిసి గురువారం రాత్రి ధర్మవరం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం ఉదయం వీరమ్మ మృతదేహం చెరువులో తేలియాడుతుండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చెరువు వద్దకు వెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీపిక మృతదేహం కోసం శనివారం చెరువులో వెతికించనున్నట్లు పోలీసులు తెలిపారు.

చదవండి: గుంత తవ్వేందుకు ప్రయత్నం.. వెలుగులోకి షాకింగ్‌ నిజం 
తోటలోకి బాలుడు, ప్రశ్నించిన వృద్ధురాలిపై దారుణం

మరిన్ని వార్తలు