అడ్డుకున్నది ఎవరు?.. సమాధానం చెప్పాలి!

25 Sep, 2020 18:13 IST|Sakshi

న్యూఢిల్లీ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక నిధులు ఇవ్వొద్దని ప్రతిపక్ష పార్టీ టీడీపీ కేంద్రానికి లేఖలు రాస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. నిర్మాణాత్మకంగా ఉండాల్సిన ప్రతిపక్షం అడ్డంకులు సృష్టిస్తూ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. నీరు-చెట్టు పథకం పనులను టీడీపీ కార్యకర్తలకు ఇచ్చి అక్రమాలకు పాల్పడ్డారని చంద్రబాబును ఉద్దేశిస్తూ దుయ్యబట్టారు. ఎన్ఆర్ఈజీఎస్ పనిదినాలు పెంచాలని కేంద్రాన్ని గట్టిగానే అడుగుతున్నామని, ఇచ్చిన 21 కోట్ల పనిదినాల్లో 19 కోట్ల పనిదినాలు వినియోగించామని చెప్పారు. (ప్రభుత్వ భూములపై టీడీపీ నేతల కన్ను)

టీడీపీ నేతలు మెటీరియల్ కాంపోనెంట్ ఇచ్చే వరకు నిధులివ్వొద్దు అని కేంద్రానికి లేఖ రాయడంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ తలారి రంగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పనికి ఆహార పథకం కింద చేసిన అక్రమాల్లో మెటీరియల్ కాంపోనెంట్ నిధులు కాంట్రాక్టర్లకు ఇవ్వడం కోసం అడుగుతున్నారన్నారు. టీడీపీకి చివరి 6 నెలల పనికి నిధులు అడగడం, అవిచ్చే వరకు కొత్తగా నిధులివ్వొద్దని కోరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అంగన్‌వాడీ సెంటర్లను విలేజ్ వెల్‌నెస్ సెంటర్లుగా మార్చిన క్రమంలో ఒక్కో సెంటర్ కి రూ.15 లక్షలు ఇవ్వాల్సిందిగా కోరినట్లుగా తెలిపారు. (ఆ దాడులు కుట్రలో భాగమే: సుచరిత)

‘స్మశానాలకు కాంపౌండ్ వాల్ నిర్మాణం గురించి కూడా అడిగాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జరుగుతున్నాయి. వారం నుంచి 10 రోజుల్లోపే కూలీలకు డబ్బు అందుతోంది. లక్షన్నర ఇళ్లు రెడీగా ఉంటే అడ్డుకుంటున్నామని టీడీపీ అంటున్నారు. అవెక్కడ ఉన్నాయో చెప్పాలి. 30 లక్షల ఇళ్లస్థలాలు పంపకానికి సిద్ధంగా ఉంటే అడ్డుకున్నది ఎవరు?’ అని ఎంపీ తలారి రంగయ్య ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు