విశాఖ ఉక్కు అమ్మకం ఆపి.. ఆదుకోవాలి

7 Feb, 2021 11:23 IST|Sakshi

ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ

సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. విశాఖ ప్రజల ఆకాంక్షలను ప్రధానికి రాసిన లేఖలో తెలిపారని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకుంటామనే నమ్మకం కుదిరిందన్నారు. ఎంతో కాలం లాభాల్లో నడిచిన స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయం దురదృష్టకరమని చెప్పారు. సమస్య ఉంటే పరిష్కరించాలి తప్ప విక్రయించే ఆలోచన సరికాదన్నారు.(చదవండి: డ్రామా : ఫిరాయించిన ‘పిల్లి’ దంపతులు)

‘‘విశాఖ ఉక్కుకు తెలుగు ప్రజలతో ఉన్న అనుబంధం అందరికీ తెలుసు. ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత గల ఫ్యాక్టరీల్లో విశాఖ ఉక్కు ఒకటి.కొన్నేళ్లు నష్టాలు వచ్చినా మళ్లీ కోలుకునే సామర్థ్యం ఉంది. స్వంత గనులు లేకనే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు నష్టాలు వస్తున్నాయి. విస్తరణకు రుణాలు తీసుకున్నందున వడ్డీభారం కూడా అధికంగా ఉంది. రూ.22 వేలకోట్ల రుణభారాన్ని ఈక్విటీగా మార్చి సొంత గనులు ఇస్తే విశాఖ ఉక్కు లాభాలు సాధిస్తుందని’’ ఆయన సూచించారు.(చదవండి: రాష్ట్రపతి పర్యటన: మంత్రి పెద్దిరెడ్డికి అనుమతి)

కేంద్రం దిగిరాకపోతే రాజీనామాలకు కూడా వెనుకాడమని, విజయసాయిరెడ్డి నేతృత్వంలో త్వరలో ప్రధానిని కలుస్తామని ఆయన తెలిపారు.ప్రధాని మోదీకి ఆంధ్రుల సెంటిమెంట్‌ను వివరిస్తామని పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్‌ భూములు ప్రస్తుతం రూ.లక్ష కోట్లకు మించి విలువ చేస్తాయని, వాటిని బుక్‌ వాల్యూకు అమ్ముతామంటే ఒప్పుకోమన్నారు. నీతి ఆయోగ్‌ చెప్పినంత మాత్రాన అమ్మాలని లేదని.. విశాఖ ఉక్కు అమ్మకం ఆపి, ఆదుకోవాలని ప్రధానిని కోరుతున్నామని ఎంపీ ఎంవీవీ అన్నారు.

మరిన్ని వార్తలు