నిరుద్యోగ యువతకు బాసటగా వైఎస్సార్‌సీపీ: ఎంపీ విజయసాయిరెడ్డి

7 May, 2022 19:07 IST|Sakshi

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ప్రాంగణంలో నిర్వహించిన జాబ్‌ మేళా మొదటి రోజు విజయవంతంగా జరిగింది. జాబ్‌మేళాలో మొదటి రోజు 142 కంపెనీలు పాల్గొనగా.. 7,473 మందికి ఉద్యోగాలు ఇచ్చాయి. 1,562 మందిని షార్ట్‌ లిస్ట్‌ చేశాయి. 373 మందికి వెంటనే ఆఫర్‌ లెటర్‌ ఇచ్చారు. మిగిలిన వారికి మెయిల్‌, వాట్సప్‌ ద్వారా అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ పంపనున్నారు. 

చదవండి: (వైఎస్సార్‌సీపీకి పొత్తు అవసరమే లేదు: విజయసాయిరెడ్డి)

మొదటి రోజు జాబ్‌ మేళా అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'జాబ్ మేళా మొదటి రోజు విజయవంతంగా జరిగింది. నిరుద్యోగ సమస్య లేకుండా చేయాలన్న సీఎం కల సాకారం కాబోతుంది. నిరుద్యోగ యువతకు బాసటగా వాళ్ల ఇళ్ళలో వెలుగు నింపుతున్నందుకు సంతోషంగా ఉంది. ఆదివారం కూడా జాబ్ మేళా కొనసాగుతోంది. ఇవాళ 31,000 మంది యువత జాబ్ మేళాకు హాజరయ్యారు. ఉద్యోగం రాని వాళ్లు నిరుత్సాహ పడవద్దు. ఉద్యోగం వచ్చే వరకూ వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. జాబ్ మేళాలు కొనసాగుతాయి. జాబ్ మేళా విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు. పార్టీలో ఒక సెల్ ఏర్పాటు చేసి నిరుద్యోగులు జాబితా రూపొందించి ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. పార్టీ కేంద్రకార్యాలయంలో సెల్ ఏర్పాటు చేస్తాం. ఉద్యోగాలు పొందిన వాళ్లు కుటుంబ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధి కృషి చెయ్యాలి' అని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. 

చదవండి: (బాబు మీ జీవిత కాలంలో ఎప్పుడైనా మంచి పనులు చేశారా: వైవీ సుబ్బారెడ్డి)

మరిన్ని వార్తలు