స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం ఢిల్లీలోనూ పోరాడతాం..

20 Feb, 2021 14:26 IST|Sakshi

విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర

కూర్మన్నపాలెం స్టీల్‌ప్లాంట్‌ గేట్‌ ఎదుట సాయంత్రం బహిరంగ సభ

సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి చేపట్టిన ఉక్కు పరిరక్షణ పోరాట పాదయాత్రకు ప్రజల నుంచి భారీగా స్పందన లభిస్తోంది. శనివారం.. జీవీఎంసీ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి.. నివాళులర్పించి విజయసాయిరెడ్డి మొదటి అడుగు వేశారు. మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అప్పలరాజు, ఎంపీలు సుభాష్‌చంద్రబోస్‌, ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు  ఆర్‌కే రోజా, గొల్ల బాబురావు, గుడివాడ అమర్‌నాథ్‌‌, అదీప్‌రాజు, విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ మోహన్, కన్వీనర్ కేకే రాజు, కుంబా రవిబాబు, విజయప్రసాద్‌, పంచకర్ల రమేష్‌, పసుపులేటి బాలరాజు, పార్టీ శ్రేణులు, విశాఖ నగర వాసులు, స్టీల్‌ప్లాంట్ కార్మికులు పెద్ద ఎత్తున ఆయన వెంట కదిలారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు.

ఉదయం జీవీఎంసీ మహాత్మా గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. ఆశీల్‌ మెట్ట జంక్షన్, సంగం శరత్, కాళీ టెంపుల్, తాటిచెట్ల పాలెం, ఊర్వశి జంక్షన్, 104 ఏరియా,  మర్రిపాలెం,  ఎన్‌ఏడీ జంక్షన్, ఎయిర్‌ పోర్ట్,  షీలానగర్, బీహెచ్‌పీవీ, పాత గాజువాక, శ్రీనగర్‌ మీదుగా కూర్మన్నపాలెం జంక్షన్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రధాన ఆర్చ్‌ వరకు ఐదు నియోజకవర్గాల మీదుగా దాదాపు 25 కి.మీ మేర పాదయాత్ర సాగనుంది. సాయంత్రం 4.30 గంటలకు స్టీల్‌ ప్లాంట్‌ ఆర్చ్‌ వద్ద భారీ బహిరంగ సభతో పాదయాత్ర ముగియనుంది.

జనసంద్రంగా కంచరపాలెం..
విశాఖలో పురాతన ప్రాంతంగా చెప్పుకునే కంచరపాలెం జనసంద్రంగా మారింది. కిక్కిరిసిన జనం మధ్య విజయసాయిరెడ్డి నడక ముందుకు సాగింది పారిశుద్ధ్య కార్మికులు వ్యాపారులు పలువురు మేధావులు ఈ సంఘీభావ యాత్రలో తమ మద్దతు పలుకుతూ విజయసాయిరెడ్డి కి స్వాగతం పలికారు.  తాటిచెట్లపాలెం కంచరపాలం ఊర్వశి జంక్షన్ పరిసరప్రాంతాలు పాదయాత్రతో జనసంద్రంగా మారాయి.మంత్రుల నుంచి సామాన్య కార్యకర్తల వరకు కూడా ఈ సంఘీభావ యాత్ర లో పాల్గొన్నారు. కవులు కళాకారులు మేధావులు. పలువురు జర్నలిస్టులు దీనికి మద్దతుగా నిలిచారు.  

సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకే.. 
యావత్‌ తెలుగు జాతికి గర్వకారణమైన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించేందుకు పాదయాత్ర చేపడుతున్నానని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఉక్కు ఉద్యమ పరిరక్షణ పాదయాత్ర సాగనుందన్నారు. ‘‘స్టీల్‌ప్లాంట్‌ ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తూ.. ప్రైవేటీకరణ జరగకుండా పరిశ్రమను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించడంతో పాటు రుణాలను ఈక్విటీ రూపంలో మార్చాలని సీఎం కేంద్రానికి ప్రతిపాదించారని’’ ఆయన పేర్కొన్నారు. ఒడిశాలో పుష్కలంగా ఉన్న ఇనుప ఖనిజానికి సంబంధించిన మైన్స్‌తో లీజు ఒప్పందాల్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. కార్మికులకు అండగా ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఉందనే భరోసాను విశాఖ ప్రజల్లో కల్పించేందుకుకు ఈ పోరాటయాత్ర చేస్తున్నామన్నారు. ఇప్పటికే సంఘీభావం ప్రకటించిన వివిధ వర్గాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
చదవండి: వారిని పిలిచినా రాలేదు: విజయసాయిరెడ్డి
విశాఖ ఘటనలో ఏపీ సర్కార్‌ పనితీరు భేష్‌

మరిన్ని వార్తలు