సాక్షి, బనశంకరి: నందమూరి తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. బుధవారం బెంగళూరులో నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను విజయసాయిరెడ్డి పరామర్శించారు.
తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తారకరత్న కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంది.. పురోగతి కనిపిస్తోందని తెలిపారు. డాక్టర్లు మంచి చికిత్స అందిస్తున్నారని, బాలకృష్ణ అక్కడే ఉండి అన్ని విషయాలు చూసుకుంటున్నారని చెప్పారు.
తారకరత్నకు గుండెపోటు వచ్చిన 45 నిమిషాల పాటు మెదడుకు రక్తప్రసరణ ఆగిపోవడం వల్ల నరాలు కాస్త దెబ్బతిన్నాయని, ఇవాళ పరిస్థితి చాలా మెరుగ్గా ఉందన్నారు. గుండెతో పాటు రక్తప్రసరణ బాగుందని, రేపటి కల్లా మరింత మెరుగవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.