ముస్లిం యువత మానవత్వం..

23 Apr, 2021 10:58 IST|Sakshi
అంత్యక్రియలు చేస్తున్న ముస్లిం యువకులు

కరోనాకు బలైన హిందూ మహిళకు అంత్యక్రియలు

ఇప్పటి వరకు 223 మందికి అంత్యక్రియలు నిర్వహించిన యువకులు

గుంటూరు మెడికల్‌: కరోనాతో చనిపోతున్న వారికి కుటుంబ సభ్యులు సైతం దూరంగా ఉంటున్న నేపథ్యంలో.. ఆ బాధితులకు వారి వారి ఆచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు గుంటూరుకు చెందిన ముస్లిం యువకులు. గుంటూరు జిల్లా మండల కేంద్రమైన దుగ్గిరాలలో  48 ఏళ్ల మహిళ కరోనాతో చనిపోవడంతో కుటుంబీకులు భౌతికకాయాన్ని ముట్టుకునేందుకు భయపడిపోయారు. సామాజిక మాధ్యమాల ద్వారా గుంటూరు కోవిడ్‌ ఫైటర్స్‌ గురించి తెలుసుకుని గురువారం వారిని సంప్రదించారు.

దీంతో కోవిడ్‌ ఫైటర్స్‌కు చెందిన పఠాన్‌ అల్లాభక్షు, పఠాన్‌ ఫిరోజ్‌ఖాన్, హబీబ్‌ అన్సారీ, పఠాన్‌ ముజీబ్‌బాషా తమ సొంత అంబులెన్స్‌లో దుగ్గిరాల వెళ్లారు. సదరు మహిళ భౌతిక కాయాన్ని తెనాలి శ్మశానవాటికకు తరలించి, హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, గతేడాది నుంచి ఇప్పటివరకు తాము కరోనాతో చనిపోయిన 223 మందికి అంత్యక్రియలు చేశామని వారు తెలిపారు. కరోనాతో చనిపోయిన వారికి కుటుంబసభ్యులు అంత్యక్రియలు చేసే పరిస్థితి లేనప్పుడు.. తమను సంప్రదిస్తే ఆ కార్యం నెరవేరుస్తామని చెప్పారు. 8143222456, 9848940304 నంబర్లలో తమను సంప్రదించాలని కోరారు.
చదవండి:
సంక్షేమ పథకాల మొత్తం లబ్ధిదారులకు ఇవ్వాల్సిందే..  
హత్యా..ఆత్మహత్యా?: బాలిక అనుమానాస్పద మృతి

మరిన్ని వార్తలు