కదం తొక్కిన ముస్లింలు

13 Jun, 2022 04:55 IST|Sakshi
ర్యాలీలో పాల్గొన్న ముస్లింలు

మహా ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలకు నిరసన

కడపలో భారీ ర్యాలీ, సభ

కడప కల్చరల్‌: మహా ప్రవక్త మహమ్మద్‌ (సొ.అ.వ)పై బీజేపీ నేతలు నుపుర్‌శర్మ, నవీన్‌కుమార్‌ జిందాల్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌బీ అంజాద్‌బాషా అన్నారు. వైఎస్సార్‌ జిల్లా కేంద్రమైన కడపలో పలు ముస్లిం సంస్థల ఆధ్వర్యంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం నేక్‌నామ్‌ఖాన్‌ కళాక్షేత్రంలో బహిరంగసభ నిర్వహించారు. డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మాట్లాడుతూ ఏ మతాన్ని ఇతర మతాల వారు కించపరచడం ధర్మం కాదని, అన్ని ధార్మిక గ్రంథాలు ఇతర మతాలను గౌరవించాలని సూచిస్తున్నాయన్నారు. నుపుర్‌శర్మ, నవీన్‌ జిందాల్‌ వ్యాఖ్యలు దేశంలోని కోట్లాది మంది ముస్లింలను ఆవేదనకు గురి చేశాయన్నారు.

ప్రధాని మోదీ జోక్యం చేసుకుని వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మాజీ మంత్రి అహ్మదుల్లా, రాజకీయ ప్రముఖులు ఎస్‌బీ అహ్మద్‌బాషా, సుభాన్‌బాషా, అమీర్‌బాబు, నజీర్‌ అహ్మద్, ఆధ్యాత్మికవేత్తలు హజరత్‌ వలీవుల్లా హుసేనీ సాహెబ్, హుసేనీ బాషా షహమీరి సాహెబ్, హజరత్‌ ముఫ్తీ మహమ్మద్‌ అలీ బొగ్దాది సాహెబ్, ముస్లిం మతగురువులు పాల్గొన్నారు. కడపలోని అల్మాస్‌పేట నుంచి ప్రారంభమైన ర్యాలీ  నేక్‌నామ్‌ఖాన్‌ కళాక్షేత్రం వరకు సాగింది.  

మరిన్ని వార్తలు