పూర్తి కావొచ్చిన నాడు–నేడు తొలి దశ పనులు 

6 Sep, 2020 05:08 IST|Sakshi

రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకున్న ఏకైక సర్కారు ఇదే

సామాజిక పెట్టుబడిగా మానవ సూచికలు మెరుగు పర్చడమే లక్ష్యం 

ప్రభుత్వ విద్యా సంస్థలపై తల్లిదండ్రులు, పిల్లల్లో విశ్వాసం పెంచడమే లక్ష్యం 

రూ.12,000 కోట్లతో మూడు దశల్లో విద్యా సంస్థల రూపు రేఖలు మార్పు 

తొలి దశలో ఇప్పటికే రూ.3,627 కోట్లతో 15,715 స్కూళ్లలో 58,559 పనులు 

రెండు, మూడవ దశల పనులకు గ్రీన్‌ సిగ్నల్‌  

2వ దశలో రూ.4,732 కోట్లతో 14,584 విద్యా సంస్థల్లో మౌలిక వసతులు  

3వ దశలో రూ.2,969 కోట్లతో 16,489 విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు 

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రభుత్వ పాఠశాలల్లో ‘నాడు–నేడు’ మొదటి దశ పనులు పూర్తి కావొచ్చాయి. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం టాయిలెట్స్‌ కూడా లేక ఆడ పిల్లలు పడుతున్న అవస్థలను ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేస్తున్నప్పుడు గమనించిన వైఎస్‌ జగన్‌.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా నాడు–నేడు కార్యక్రమం చేపట్టారు. తద్వారా భారీ ఖర్చుతో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారిపోతున్నాయి.  

► రాష్ట్రంలో 46,788 ప్రైమరీ, అప్పర్‌ ప్రైమరీ, రెసిడెన్షియల్‌ స్కూళ్లు, హాస్టళ్లు, జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో పది రకాల కనీస మౌలిక సదుపాయాల కల్పన కోసం మూడు దశల్లో మన బడి నాడు–నేడు కార్యక్రమాన్ని చేపట్టారు.  
► మూడు దశల్లో నాడు–నేడు కార్యక్రమానికి రూ.12,000 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో భాగంగా గత ఏడాది నవంబర్‌ 14వ తేదీన బాలల దినోత్సవం నాడు ఒంగోలులో మన బడి నాడు–నేడు తొలి దశను ప్రారంభించారు.  
► తొలి దశలో రూ.3,627 కోట్ల వ్యయంతో 15,715 ప్రభుత్వ విద్యా సంస్థల్లో పది రకాల మౌలిక వసతుల పనులకు శ్రీకారం చుట్టారు.  
► ఇందులో ఇప్పటికే 58,559 పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందు కోసం ఇప్పటికే రూ.1,417 కోట్లు వ్యయం చేశారు.

రెండు, మూడవ దశల పనులపై దృష్టి
► రెండో దశలో 14,584 స్కూళ్లలోరూ.4,732 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో రెండో దశ పనులను చేపట్టి వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  
► మూడో దశలో 16,489 స్కూళ్లలో రూ.2,969 కోట్ల వ్యయంతో పనులు చేపట్టేందుకు సీఎం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ పనులను వచ్చే ఏడాది నవంబర్‌లో ప్రారంభించి మార్చి నెలాఖరుకు పూర్తి చేయాలని సీఎం  స్పష్టం చేశారు. ఇందుకు నిధుల సమీకరణ మార్గాలపై కూడా మార్గ నిర్దేశం చేశారు.  పిల్లల తల్లిదండ్రుల కమిటీ పర్యవేక్షణలో పనులు సాగుతున్నాయి. పాఠశాల ప్రస్తుత పరిస్థితిపై లక్షల ఫొటోలు తీశారు. రేపు మౌలిక సదుపాయాలు కల్పించాక.. ఆ మార్పును కళ్లకు కట్టినట్లు చూపిస్తారు.  

మరిన్ని వార్తలు