విద్యుత్‌ కొనుగోళ్లలో రూ.126 కోట్లు ఆదా

3 Oct, 2021 03:57 IST|Sakshi

ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌

సాక్షి, అమరావతి: ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం గత రెండేళ్లుగా అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు సత్ఫలితాలనిస్తున్నాయని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ తెలిపారు. 2021–22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో చేసిన విద్యుత్‌ కొనుగోళ్లలో డిస్కంలు రూ.126.15 కోట్లు ఆదా చేశాయన్నారు. ఈ పొదుపు ప్రయోజనాలను తిరిగి వినియోగదారుల కోసమే ఉపయోగించాలని ప్రభుత్వం, విద్యుత్‌ సంస్థలు భావిస్తున్నాయని తెలిపారు.

బాపూజీ జయంతి సందర్భంగా శనివారం విద్యుత్‌ సౌధలోని గాంధీ విగ్రహానికి  నివాళులర్పించారు.  ఆయన మాట్లాడుతూ ఏపీఎస్పీడీసీఎల్‌ 6,013 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఏపీఈఆర్సీ నిర్ణయించిన ధర కంటే 15 పైసలు తక్కువకే కొనుగోలు చేసిందన్నారు. తద్వారా రూ.89.23 కోట్లు ఆదా అయ్యిందని తెలిపారు.  ఏపీíసీపీడీసీఎల్‌ రూ.33.25 కోట్లు, ఏపీఈపీడీసీఎల్‌ రూ.3.67 కోట్లు ఆదా చేశాయన్నారు.  ఏపీ ట్రాన్స్‌కో జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.వెంకటేశ్వరరావు, గ్రిడ్‌ ట్రాన్స్‌మిషన్‌ డైరెక్టర్‌ కె.ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు