సీఎం జగన్‌ను కలిసిన నాల్కో, మిథానీ సీఎండీలు

25 Apr, 2022 18:49 IST|Sakshi

సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నాల్కో సీఎండీ శ్రీధర్‌ పాత్ర, మిథానీ సీఎండీ సంజయ్‌ కుమార్‌ ఝా కలిశారు. నాల్కో, మిథానీ సంయుక్త సంస్ధ ఉత్కర్ష అల్యుమినియం ధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (యూడీఏఎన్‌ఎల్‌) ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెంలో హై ఎండ్‌ అల్యుమినియం అల్లాయ్‌ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. రూ.5,500 కోట్లతో ఏర్పాటు కానున్న పరిశ్రమ, ఏడాదికి 60,000 మెట్రిక్‌ టన్నుల ప్రొడక్షన్‌ కెపాసిటీ, రెండు నుంచి రెండున్నరేళ్లలో ప్రాజెక్ట్‌ పూర్తి కానుంది.

చదవండి: సీపీఎస్‌ రద్దుపై ఏపీ ప్రభుత్వం కొత్త కమిటీ

దాదాపు 750-1000 మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనపై ఎదురవుతున్న సమస్యలను సీఎం దృష్టికి అధికారులు తీసుకురాగా, వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను సీఎం ఆదేశించారు.

రక్షణ అనుబంధ రంగాలకు సంబంధించిన పరికరాల తయారీదారుల అవసరాలు తీర్చడానికి ఈ ప్రాజెక్ట్‌కు అనుబంధంగా ఎంఎస్‌ఎంఈ పార్క్‌ను కూడా ఏర్పాటుచేయాలని సీఎం సూచించగా, సీఎండీలు అంగీకరించారు. ఈ సమావేశంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఏపీఐఐసీ వీసీ అండ్‌ ఎండీ జేవీఎన్‌.సుబ్రహ్మణ్యం, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ సృజన గుమ్మళ్ళ, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు