1.50 కోట్ల కార్డుల్లో 4.34 కోట్ల మంది పేర్లు
ఆ మేరకు ప్రతి నెలా పెరుగుతున్న సరుకుల పంపిణీ
గతంలో కార్డుల్లో పేర్లు నమోదుకు అనుమతి నిరాకరణ
సాక్షి, అమరావతి: బియ్యం కార్డుల్లో కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేస్తుండటంతో లబ్ధిదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. వివిధ కారణాల వల్ల పేర్లు నమోదు కాకపోవడం, కొత్తగా జన్మించిన వారి పేర్లు నమోదుకు గతంలో అనుమతించకపోవడంతో కార్డుదారులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ప్రస్తుతం దరఖాస్తు చేసిన వారంలోపు కార్డుల్లో పేర్లు నమోదు చేస్తున్నారు.
► గత నాలుగు నెలల్లో 11.88 లక్షల మంది పేర్లు బియ్యం కార్డుల్లో కొత్తగా నమోదు చేశారు.
► గతంలో మీ సేవా కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే ఏళ్లు గడిచినా వాటికి సమాధానం దొరికేది కాదు. ప్రస్తుతం ఆ పరిస్థితి నుంచి పేదలు ఉపశమనం పొందారు.
► ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది, లేదా గ్రామ వలంటీర్కు పేరు నమోదు చేయాల్సిన వ్యక్తి ఆధార్ తదితర వివరాలు ఇస్తే సరిపోతుంది.
► రాష్ట్రంలో ప్రస్తుతం 1.50 కోట్లకు పైగా ఉన్న బియ్యం కార్డుల్లో 4.33 కోట్లకు పైగా పేర్లు నమోదై ఉన్నాయి.
► కరోనా కారణంగా ఉపాధి దొరకనందున కుటుంబంలో ఒక్కో సభ్యుడికి నెలకు 10 కిలోల బియ్యం, కుటుంబానికి కిలో కందిపప్పు ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.
► ఆర్థిక భారం అయినప్పటికీ పేదలు పస్తులుండకూడదనే ఉద్దేశంలో ప్రభుత్వం
ఉచితంగా సరుకులు పంపిణీ చేస్తోంది.
► కొత్తగా పేర్లు నమోదుకు అవకాశం ఇవ్వడంతో ప్రతి నెలా ఆ మేరకు సరుకులు తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.