నవతరం పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం
నరసరావుపేట: తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఉపఎన్నికల్లో నవతరం పార్టీకి కేటాయించిన గాజు గ్లాసు గుర్తును రద్దు చేస్తే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రమణ్యం తెలిపారు. గాజు గ్లాసు గుర్తు రద్దు కోసం కేంద్ర మంత్రులు ప్రయత్నించడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ నవతరం పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న గోదా రమేష్కుమార్తో కలిసి మంగళవారం ఆయన పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఢిల్లీకి బీజేపీ నేతలతో కలిసి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. బీజేపీ అనుబంధ సంస్థల సహకారంతో నవతరం పార్టీ అభ్యర్థిపై దాడులు చేయించే ప్రమాదం ఉందన్నారు. అందువలన పోటీలో ఉన్న అభ్యర్థి రమేష్కుమార్కు భద్రత కల్పించాలని కోరారు. బత్తుల అనిల్, చాట్ల సాగర్ పాల్గొన్నారు.