నాడు అవమానం.. నేడు అందలం 

8 Apr, 2021 04:33 IST|Sakshi
మాట్లాడుతున్న యానాదయ్య, పక్కన నేతలు

నాయీబ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ యానాదయ్య ఉద్వేగం 

సీఎం వైఎస్‌ జగన్‌ వల్లే ఈ గౌరవం

తిరుపతి తుడా:  గతంలో చంద్రబాబు తీరుతో నాయిబ్రాహ్మణులు తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నారని నాయిబ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ సిద్దవటం యానాదయ్య చెప్పారు. అవమానాలన్నీ దిగమింగి జగనన్నను సీఎంగా గెలిపించుకోవడంతో ఇప్పుడు గౌరవ ప్రదమైన స్థానంలో నిలిపారని చెప్పారు. తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో భాగంగా సుందరయ్యనగర్‌లో బుధవారం నాయిబ్రాహ్మణులతో సమావేశమయ్యారు. ఉప ఎన్నికల్లో  ఫ్యాన్‌ గుర్తుకు ఓటెయ్యాలని తీర్మానించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తిని భారీ మెజారిటీతో గెలిపించాలని నిర్ణయించారు. అనంతరం స్థానిక వైఎస్సార్‌సీపీ నేత చిమటా రమేష్, నాయిబ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ తొండమల్ల పుల్లయ్య, కుల సంఘాల నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యానాదయ్య మాట్లాడుతూ తిరుమలలో పీస్‌ రేట్‌పై పనిచేసే 241 క్షురకులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించారని, జగనన్న తోడు పథకం ద్వారా క్షురకులకు రూ.10 వేల చొప్పున రూ.58 కోట్లు, దేవాలయాల్లో పనిచేసే మంగళ వాయిద్యకారులకు గౌరవ వేతనాన్ని రూ.25 వేలకు పెంచిన విషయాన్ని ప్రస్థావించారు. నాయిబ్రాహ్మణుల రాజకీయ ఎదుగుదలకు ఇప్పుడే అడుగులు పడ్డాయని.. భవిష్యత్తులో నాయిబ్రాహ్మణులకు మరింత ప్రాధాన్యం పెరగాలంటే జగనన్న వెంట నడవాలని యానాదయ్య పిలుపునిచ్చారు. నాయిబ్రాహ్మణులంతా మూకుమ్మడిగా ఫ్యాన్‌ గుర్తుకు ఓట్లు వేస్తున్నట్టు ఈ సందర్భంగా వారు మీడియాతో చెప్పారు. 

మరిన్ని వార్తలు