రఘురామ కృష్ణరాజు కంపెనీకి చుక్కెదురు

31 Dec, 2021 19:48 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ:  జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఎంపీ రాఘురామ కృష్ణరాజు కంపెనీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇండ్‌ భారత్‌ థర్మల్‌ పవర్‌ లిమిటెడ్‌ పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌టీ తిరస్కరించింది. వివిధ బ్యాంకుల నుంచి ఇండ్‌ భారత్‌ కంపెనీ మొత్తం రూ. 1383 కోట్ల రుణం తీసుకుంది. అయితే రికవరీ కోసం ఢిల్లీలోని డెబిట్‌ ట్రిబ్యునల్‌ను బ్యాంకుల కన్సార్షియం అశ్రయించింది. రూ.1327 కోట్ల అప్పులకు గాను తనఖా  పెట్టిన ఆస్తుల విలువ రూ. 872 కోట్లే ఉంది. దివాళా అయిన కంపెనీ పరిష్కార ప్రక్రియ చేయాలని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కోరింది.   

దివాలా ప్రక్రియకు అనుమతించవద్దంటూ రఘురామ కంపెనీ వాదించింది. పరిష్కార ప్రక్రియ ఆపాలంటూ ఎన్‌సీఎల్‌టీలో రఘురామ కంపెనీ వాదనలు వినిపించింది. అయితే రఘురామ కంపెనీ వాదనలతో జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ ఏకీభవించలేదు. ఆ వాదనను తిరస్కరించిన న్యాయమూర్తి.. దివాలా ప్రక్రియకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దివాలా పరిష్కార నిపుణుడిని నియమించి, మూడు రోజుల్లో దివాలా ప్రక్రియ గడువుతో సహా వివరాలన్నీ తెలియజేయాలని ఆదేశించారు. 

ఈ మేరకు ఫారం–2 దాఖలు చేయాలని స్పష్టం చేశారు. కంపెనీ ఆస్తులపై రఘురామకు ఎలాంటి అధికారం లేదని ట్రిబ్యునల్‌ పేర్కొంది. మధ్యంతర పరిష్కార ప్రక్రియ పూర్తి చేసే అధికారాన్ని శ్రీకాకుళం వంశీకృష్ణకు అప్పగించింది. మూడు రోజుల్లో ఇండ్‌ భారత్‌ కంపెనీని రిజల్యూషన్‌ స్వాధీనం చేసుకోనుంది.

మరిన్ని వార్తలు