టెలిస్కోపిక్‌ బ్రాంకోస్కోప్‌ ద్వారా తొలగించిన వైద్యులు 

6 Aug, 2021 09:02 IST|Sakshi

కర్నూలు (హాస్పిటల్‌): పొరపాటున మింగిన నీడిల్‌ (సూది) ఊపిరితిత్తుల్లో ఇరుక్కుంది. కర్నూలులోని సత్యసాయి ఈఎన్‌టీ ఆస్పత్రి వైద్యులు ఆధునిక పరికరాలతో  ఆ సూదిని తొలగించి ఆయువు పోశారు. వివరాలను గురువారం ఎన్‌ఆర్‌ పేటలోని శ్రీ సత్యసాయి ఈఎన్‌టీ ఆస్పత్రిలో వైద్యులు డాక్టర్‌ బి.జయప్రకాశ్‌రెడ్డి గురువారం మీడియా సమావేశంలో తెలిపారు.

తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా అనంతపురం గ్రామానికి చెందిన పరశురాముడు పశువులకు వేసే సూదిమందు ఇచ్చే నీడిల్‌ (సూదిని) నోటిలో పెట్టుకుని పరధ్యానంగా ఉన్నాడు. ఈ సమయంలో ఆ సూది పొరపాటున గొంతులోకి వెళ్లింది. దీంతో అతను ఉక్కిరిబికిరి అయ్యాడు. శ్వాస తీసుకోవడం కష్టంగా మారి విపరీతమైన దగ్గు, గొంతునొప్పితో బాధపడుతుండడంతో ఆస్పత్రిలో చేరాడు. పరిశీలించిన వైద్యులు అత్యాధునిక వైద్యపరికరాలైన టెలిస్కోపిక్‌ బ్రాంకోస్కోప్‌ ద్వారా చాకచక్యంగా ఆ సూదిని బయటకు తీశారు. ఇప్పటివరకు తాను నిర్వహించిన చికిత్సల్లో ఇది ఎంతో క్లిష్టమైందని డాక్టర్‌ జయప్రకాశ్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు