నెల్లూరు జిల్లా పరిహారం కేసు: ఐదుగురు ఐఏఎస్‌లకు ఊరట

23 Sep, 2021 13:57 IST|Sakshi

సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలను సస్పెండ్‌ చేసిన డివిజన్‌ బెంచ్‌

సాక్షి, అమరావతి: 2015 నాటి భూసేకరణకు సంబంధించిన ఒక కోర్టు ధిక్కార కేసులో పలువురు ఐఏఎస్‌ అధికారులకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఊరట లభించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్‌లపై సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలను డివిజన్‌ బెంచ్‌ సస్పెండ్‌ చేసింది. బాధితులకు ఇప్పటికే పరిహారం అందినట్లు ఐఏఎస్‌లకు కోర్టుకు తెలపడంతో ఈ కేసులో తీర్పును సస్పెండ్‌ చేస్తూ డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. 
(చదవండి: కోర్టు ధిక్కార కేసులో.. పలువురు ఐఏఎస్‌లకు జైలుశిక్ష )

2015 నాటి భూసేకరణకు సంబంధించిన ఒక కోర్టు ధిక్కార కేసులో పలువురు ఐఏఎస్‌ అధికారులకు కోర్టు జైలుశిక్ష, జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌కు నాలుగు వారాల జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా.. ప్రస్తుత ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్‌సింగ్‌ రావత్‌కి నెలరోజుల జైలు, రూ.2వేల జరిమానా..  అప్పటి జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజుకు రెండు వారాల జైలుశిక్ష, రూ.1000 జరిమానా.. అప్పటి మరో కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు, ప్రస్తుత కలెక్టర్‌ ఎన్‌వీ చక్రధర్‌లకు రూ.2వేల చొప్పున జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ గురువారం తీర్పు వెలువరించారు. అప్పీల్‌కు వెళ్లేందుకు వీలుగా న్యాయమూర్తి తన తీర్పు అమలును నాలుగు వారాలపాటు నిలుపుదల చేశారు.  

చదవండి: అగరబత్తీల విషయంలో జోక్యం చేసుకోలేం

మరిన్ని వార్తలు