పరిశ్రమల ఖిల్లా ఆ జిల్లా.. రెండున్నర ఏళ్లలో ఆరు వేల ఉద్యోగాలు    

15 Dec, 2021 18:32 IST|Sakshi

ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే  

నైపుణ్య నేస్తంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ 

పరిశ్రమల ఆధారంగా నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ 

ప్రత్యేకంగా జాబ్‌మేళాలతో ఉద్యోగాల కల్పన

జిల్లా పరిశ్రమలకు ఖిల్లాగా మారింది. సువిశాలమైన తీరం, ఆర్థిక మండళ్లు. భారీ పోర్టు, అనుబంధ పరిశ్రమలతో పారిశ్రామిక హబ్‌గా తయారైంది. దీంతో   పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పరిశ్రమల ఏర్పాటులో 75 శాతం స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రభుత్వం చట్టబద్ధత చేయడం నిరుద్యోగులకు వరంగా మారింది. పరిశ్రమల ఆధారంగా నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో నిరుద్యోగులు ఉద్యోగాల్లో కొలువుదీరుతున్నారు. 

సాక్షి, నెల్లూరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న పారిశ్రామిక చేయూత జిల్లా ముఖచిత్రాన్ని మార్చేసింది. పారిశ్రామికాభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. నిరుద్యోగులకు కొలువులు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఎన్నికలకు ముందు నిర్వహించిన ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన హమీల్లో భాగంగా ఇప్పటికే గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాల్లో ఉద్యోగస్తులతో భర్తీ చేశారు. నూతనంగా ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు అందించే బిల్లుకు కూడా చట్టబద్ధత కల్పించారు. పోటీ ప్రపంచంలో యువతకు ఉద్యోగాలకు తగిన నైపుణ్యత ఇచ్చి జాబ్‌ మేళాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నారు.  

మంత్రి మేకపాటి చొరవతో..    
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు నుంచి ఇప్పటికే నైపుణ్య శిక్షణతో దాదాపు 6 వేల మంది కొలువు తీరారు. జిల్లాలో పరిశ్రమల ఆధారిత నైపుణ్య శిక్షణ ఇచ్చి కొలువులు ఇప్పించారు. ప్రత్యేకంగా 2019–20లో మూడు జాబ్‌ మేళాలతో పాటు 41 స్కిల్‌ కనెక్ట్స్‌ నిర్వహించి 1,368 మందికి ఉపాధి కల్పించారు. 2020–21లో 4 స్కిల్‌ కనెక్ట్స్‌ నిర్వహించి 154 మందికి ఉపాధి కల్పించారు. 2021–22 ఒక జాబ్‌మేళా, 5 స్కిల్‌ కనెక్ట్స్‌ నిర్వహించి 1,152 మందికి ఉపాధి కల్పించారు.  మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఆత్మకూరు, ఉదయగిరి వంటి మెట్ట ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించారు.

చదవండి: (రైతన్నకు 100 % ‘మద్దతు’)

ఆత్మకూరులో ఇప్పటికే రెండు విడతలుగా జాబ్‌మేళాలు నిర్వహించి దాదాపు 2 వేల మందికి పైగా ఉద్యోగాలు  కల్పించారు. 2019 నవంబర్‌లో ఆత్మకూరు పాలిటెక్నిక్‌ కళాశాలలో తొలి జాబ్‌మేళాలో 1,716 మంది నిరుద్యోగులు హాజరు కాగా, అందులో 424 మందిని అక్కడే ఎంపిక చేసి వివిధ కంపెనీల్లో ఉద్యోగ నియామకాలు పత్రాలు ఇచ్చారు. 674 మందికి ఒక నెల పాటు నైపుణ్య శిక్షణ అందించి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించారు. వీరితో పాటు మరో 213 మందికి దీర్ఘకాలిక శిక్షణ ఇప్పించి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించారు. గత అక్టోబర్‌ 30న ఆత్మకూరు పాలిటెక్నిక్‌ కళాశాలలో జరిగిన మరో జాబ్‌మేళాలో 2,437 మంది నిరుద్యోగ యువతీ, యువకులు హజరు కాగా వారిలో 25 కంపెనీలు 840 మందిని ఎంపిక చేసి ఉద్యోగాలు కల్పించాయి.   

స్కిల్‌డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు 
నిరుద్యోగుల్లో నైపుణ్యాలను పెంచేందుకు వివిధ యూనివర్సిటీలు, సంస్థలతో కలిసి అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. విద్యార్థుల్లో నైపుణ్యతను పెంపొందించడంతో పాటు వారి దృక్ఫథంలో మార్పును తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. స్కిల్‌డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఆ«ధ్వర్యంలో నిరుద్యోగ యువతకు జాబ్‌మేళాలు నిర్వహించి స్కిల్‌ కనెక్ట్, ఏఎస్‌సీ డ్రైవ్‌ ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు. యువతీ, యువకులు వారి ఆసక్తి మేరకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నారు.అలాగే రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి జాబ్‌మేళాలు, స్కిల్‌ కనెక్ట్‌ డ్రైవ్స్‌ నిర్వహించి ఉద్యోగాలు కల్పించారు 

పరిశ్రమల ఆధారిత నైపుణ్య శిక్షణ  
యువతకు స్థానికంగా ఉండే పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని శ్రీసిటీలో పరిశ్రమల ఆధారిత నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఇండస్ట్రీ కస్టమైజేడ్‌ స్కిల్‌ ట్రైనింగ్, ప్లేస్‌మెంట్‌సెంటర్‌ను ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. జాబ్‌మేళాలు నిర్వహించి ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్నాం. 
– షేక్‌ అబ్దుల్‌ ఖయ్యూం, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి, నెల్లూరు  

మరిన్ని వార్తలు