నెల్లూరులో ఘోర ప్రమాదం: తోడేరు చెరువులో పడవ బోల్తా.. ఆరుగురు యువకుల గల్లంతు

26 Feb, 2023 21:04 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది.  పొదలకూరు మండలం తోడేరు గ్రామ చెరువులో ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. వాళ్ల ఆచూకీ కోసం పోలీసులు, ఫైర్‌ సిబ్బంది గాలిస్తున్నారు. సెలవు దినం కావడంతో వాళ్లంతా సరదాగా షికారుకు వెళ్లినట్లు తెలుస్తోంది.  

ప్రమాదం సమయంలో పడవలో పది మంది యువకులు ఉన్నారు. నలుగురు క్షేమంగా బయటపడ్డారు. ఆరుగురు గల్లంతయ్యారు. గల్లంతయిన యువకుల పేర్లు.. సురేంద్ర,(19), రఘు (24), బాలాజీ (21), త్రినాథ్ (18), కళ్యాణ్(28), ప్రశాంత్(29)గా నిర్ధారించారు పోలీసులు.  పొదలకూరు సీఐ సంగమేశ్వరరావు, ఎస్ఐ కరిముల్లా  పర్యవేక్షణలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఇక తోడేరు చెరువులో బోటు ప్రమాద సంఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి కాకాణి. ప్రమాదం నుంచి తెలియగానే.. కేరళ వ్యవసాయ సదస్సు నుంచి హుటాహుటిన బయలుదేరారు ఆయన. ఈ అర్ధరాత్రికి ఆయన తోడేరుకు చేరుకోనున్నట్లు సమాచారం. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు ముమ్మురం చేయాలని అధికారులను ఆదేశించారాయన.

మరిన్ని వార్తలు