సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 2023- 27 వైఎస్ఆర్ ఏపీ 1 పోర్టల్ను మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, డైరెక్టర్ సృజన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. నూతన ఇండస్ట్రియల్ పాలసీ రూపకల్పనలో పారిశ్రామిక వేత్తల ఆలోచనల్ని పరిగణలోకి తీసుకుంటున్నామని అన్నారు. ఎకనామికల్ గ్రోత్ అనేది ప్రధాన అంశంగా తీసుకున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్ ఏపీ పోర్టల్ ద్వారా 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతి ఇవ్వడంతో పాటు మూడు వారాల్లోనే పరిశ్రమలకు భూమి కేటాయింపు ఉంటుందన్నారు.
దేశంలో 3 కారిడార్లు ఉన్న రాష్ట్రం ఏపీ.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి దిశగా ముందుకు సాగుదామన్నారు. విశాఖ వేదికగా జీ20 సదస్సుకు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సదస్సు రేపట్నుంచి 30 వరకు జరగనుంది. ఇందుకు 40 దేశాల నుంచి 200 మంది దేశ, విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇప్పటికే విశాఖలో జీఐఎస్ విజయవంతం కాగా జీ20 సదస్సును కూడా అదే రీతిలో నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖను అత్యంత సుందరంగా జీవీఎంసీ అధికారుల తీర్చిదిద్దారు.