వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లకు కొత్త జాబ్‌ చార్ట్‌ 

1 Feb, 2023 04:33 IST|Sakshi

సాక్షి, అమరావతి: వీఆర్‌వోలు, గ్రామ సర్వేయర్లకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త జాబ్‌ చార్ట్‌ ఇచ్చింది. గ్రామ సచివాలయాల్లో పనిచేసే వీఆర్‌వోలు, వార్డు సచివాలయాల్లో పనిచేసే వార్డు రెవెన్యూ కార్యదర్శులకు కంబైన్డ్‌ జాబ్‌ చార్ట్, గ్రేడ్‌–1, 2, 3 గ్రామ సర్వేయర్లకు జాబ్‌ చార్ట్‌లపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ రెండు వేర్వేర్లు ఉత్తర్వులిచ్చారు. 

వీఆర్వోల జాబ్‌ చార్ట్‌..
తుపాన్లు, వరదలు, ప్రమాదాలు లాంటి విపత్తు ని­ర్వ­హ­ణ విధులు, ఓటర్ల జాబితా అప్‌డేషన్, ప్రభు­త్వం నిర్దేశించే ఇతర ఎన్నికల విధులు, రెవెన్యూ రికార్డుల మ్యుటేషన్‌ పనులు, భూముల రీ సర్వే కార్యకలా­పాలు, నివాస, నేటివిటీ లాంటి సర్టిఫికెట్ల జారీ విధులను నిర్వర్తించాలని పేర్కొ­న్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో రెవెన్యూ శాఖకు సంబంధించిన అన్ని వినతులను పరిశీలించి తీసుకున్న చర్యలపై ఆయా శాఖలకు నివేదికలు పంపడం లాంటి పనుల్ని నిర్దేశించారు.

పంటల అజ­మా­యిషీ, సర్వే రాళ్ల తనిఖీ, ప్రభుత్వ భూములు, ఆస్తుల రక్షణ, రోడ్లు, వీధులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా కాపాడటం, రెవెన్యూ సెస్, పన్నులు వసూలు చేయాలి. హత్య­లు, ఆత్మ­హత్యలు, అసహజ మర­­ణా­లు, గ్రామాల్లో శాంతి భద్రతకు విఘాతం కలిగించే అంశాలను తహశీ­ల్దార్‌కు నివేదించడంతోపాటు తహశీల్దార్, కలెక్టర్, సీసీఎల్‌ఏ, ప్రభుత్వం నిర్దేశించే ఇతర పనుల్ని ఎప్పటికప్పుడు నిర్వర్తిం­చా­లని జాబ్‌ చార్ట్‌లో పేర్కొన్నారు. ఒకే సమయంలో ఎక్కువ పనులు చేయాల్సి వచ్చినప్పుడు ప్రాధా­న్యతకు అనుగుణంగా చేపట్టాలని సూచించారు.  

గ్రామ సర్వేయర్ల జాబ్‌ చార్ట్‌
వ్యక్తులు, ప్రభుత్వ సంస్థలతోపాటు అనుమతించిన లేఅవుట్లకు సంబంధించి ఎఫ్‌లైన్‌ పిటిషన్లు (సరిహ­ద్దు వివాదాలు, హద్దులు–విస్తీర్ణంలో తేడాలు లాంటి వాటిపై అందే దరఖాస్తులు) స్వీకరించి పరిష్కరించాలి. సర్వే సబ్‌ డివిజన్, సంబంధిత మార్పులు చేసే బాధ్యత వారిదే. గ్రామ కంఠాలు, పూర్తిస్థాయి స్ట్రీట్‌/టౌన్‌ సర్వే, కొత్త సబ్‌ డివిజన్, పాత సబ్‌ డివిజన్లను కలపడంపై అందే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించి గ్రామ రికార్డుల్లో చేర్చాలి.

సచివాలయాల పరిధిలో అందే అన్ని వినతులతోపాటు వివిధ శాఖల అధికారులు రిఫర్‌ చేసే అంశాలపై నివేదికలు ఇవ్వాలి. మిస్‌ అయిన, దెబ్బతిన్న, తొలగించిన సర్వే పాయింట్లు, మార్క్‌లు, గ్రౌండ్‌ కంట్రోల్‌ పాయింట్లు సర్వే, సరిహద్దు చట్టం ప్రకారం ముసాయిదా నోటీసు ఇచ్చి రెన్యువల్‌ చేయాలి. తన పరిధిలోని 10 శాతం సర్వే పాయింట్లు, మార్క్‌లు, గ్రౌండ్‌ కంట్రోల్‌ పాయింట్లను ప్రతి నెలా తనిఖీ చేయాలి. కాంపిటెంట్‌ అథారిటీ అధికారుల ఆదేశాల ప్రకారం రికార్డు­ల్లో తప్పులను సరి చేయాలి.

పై అధికారులకు సమాచారమిచ్చి అన్ని తనిఖీలకు గ్రామ సర్వేయర్లు హాజరు కావాలి. సర్వే పరికరాలు, ఇతర వస్తువులను సర్వీస్‌ చేయించి నిర్వహణ చేపట్టాలి.నెలవారీ టూర్‌ డైరీలు, ప్రోగ్రెస్‌ స్టేట్‌మెంట్లు ఇతర నిర్దేశిత సమాచారాన్ని సర్వే సెటిల్మెంట్‌ కమిషనర్‌కు పంపాలి. సర్వే కార్యకలాపాలను ఈటీఎస్, డీజీపీఎస్, కార్స్‌ లాంటి అత్యాధునిక సాంకేతిక పరికరాలతోనే నిర్వహించాలి. వీఆర్‌వోలకు సహకరించాలి. ఈ జాబ్‌ చార్ట్‌ ఆధారంగా పెర్‌ఫార్మెన్స్‌ ఇండికేటర్స్‌ కూడా ఇచ్చారు.    

మరిన్ని వార్తలు