AP: కొలువులు పట్టాలి

28 Mar, 2022 02:28 IST|Sakshi

రాష్ట్రంలో కాలేజీ విద్యకు కొత్త రూపు

నైపుణ్యంతో కూడిన విద్యను అభ్యసించేలా సర్కారు చర్యలు

విద్యార్థులకు అందుబాటులో మార్కెట్‌ ఓరియెంటెడ్‌ కోర్సులు

లెర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ద్వారా పాఠాలు.. ఇంగ్లిష్‌ లెర్నింగ్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు

144 కాలేజీల్లో వర్చువల్‌ క్లాస్‌ రూములు

ఐసీటీ బేస్డ్‌ టీచింగ్‌ కోసం 56 కాలేజీల్లో డిజిటల్‌ తరగతులు

సామాజిక, నైతిక బాధ్యత పెంచేలా హెచ్‌వీపీఈ కోర్సులు

సాక్షి, అమరావతి: కర్నూలుకు చెందిన రాము ఎమ్మెస్సీ చదివాడు. నాలుగేళ్లుగా ఉద్యోగం కోసం పలు విధాలా ప్రయత్నించాడు. పలు సంస్థల్లో ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. వారడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాడు. త్వరలో ఇంటిమేట్‌ చేస్తామనేవారు. ఆ తర్వాత వారి నుంచి కాల్‌ వస్తుందని రోజుల తరబడి ఎదురు చూసినా ఫలితం ఉండేది కాదు. ఇటీవల మార్కెట్‌ ఓరియంటెడ్‌ కోర్సు పూర్తి చేయడంతో వెంటనే ఓ మంచి ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది.

ఇదే పని నాలుగేళ్ల క్రితమే చేసి ఉంటే ఈ పాటికి మంచి పొజిషన్‌లో ఉండేవాడినని చెబుతున్నాడు. ఇదే రీతిలో రాష్ట్రంలో ఎంతో మంది పోస్టు గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి వారందరికీ ఆయా డిగ్రీ కోర్సులు చదువుతున్నప్పుడే సంబంధిత రంగానికి సంబంధించి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉంటే ఇలా ఉద్యోగాల కోసం ఎదురు చూడాల్సి వచ్చేది కాదు. ఇకపై ఏ ఒక్క విద్యార్థికీ ఉన్నత చదువు తర్వాత ఉపాధి సమస్య ఎదురవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా నైపుణ్యంతో కూడిన విద్యను అందించేలా విద్యా విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. 

మార్కెట్‌ అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ
► నేటి పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా విద్యార్థులకు మేలు చేసేలా క్లౌడ్‌ కంప్యూటింగ్, ఆక్వాకల్చర్‌ తదితర మార్కెట్‌ ఓరియెంటెడ్‌ కోర్సులకు శ్రీకారం చుట్టారు. ఆన్‌లైన్‌ ఆధారిత పరిజ్ఞానాన్ని అందించేందుకు లెర్నింగ్‌ మేనేజ్‌మెంటు సిస్టమ్‌ (ఎల్‌ఎంఎస్‌) ఏర్పాటు చేశారు. వివిధ సబ్జెక్టులకు సంబంధించిన వీడియో పాఠాలను దీనిద్వారా విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. 
► విద్యార్థుల కెరీర్‌ మరింత ఉజ్వలంగా ఉండేందుకు వారికి అవసరమైన శిక్షణ, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంపొందించేలా ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ల్యాబ్స్‌ వంటివి నెలకొల్పారు.
► విద్యార్థులు కేవలం సబ్జెక్టు అంశాలకే పరిమితం కాకుండా వారికి సామాజిక, నైతిక విలువలపై అవగాహన కలిపించేలా హ్యూమన్‌ వాల్యూస్, ప్రొఫెషనల్‌ ఎథిక్స్‌ (హెచ్‌వీపీఈ) అంశాలనూ బోధిస్తున్నారు. 
► 144 కాలేజీల్లో వర్చువల్‌ క్లాస్‌ రూములను ఏర్పాటు చేయించి, అధునాతన విధానాల్లో బోధిస్తున్నారు. ఐసీటీ ఆధారిత బోధన, అభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు 56 కాలేజీల్లో డిజిటల్‌ క్లాస్‌ రూములను నెలకొల్పారు.
► విద్యార్థుల్లో చైతన్యం నింపేందుకు 13 జిల్లాల్లో జిల్లా వనరుల కేంద్రాలను ఏర్పాటు చేయించారు. అధ్యాపకులు సరైన రీతిలో బోధన సాగిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి విద్యార్థులతోనే విద్యార్థి సంతృప్తి సర్వేలను నిర్వహిస్తూ లెక్చరర్ల పనితీరును బేరీజు వేస్తున్నారు. అధ్యాపకుల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్‌ ఆడిట్‌ను ఏర్పాటు చేశారు.
► జవహర్‌ నాలెడ్జి సెంటర్ల ద్వారా కూడా ఉపాధి నైపుణ్యాలలో శిక్షణ ఇస్తున్నారు. జాబ్‌ మేళాలు, క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లను నిర్వహిస్తూ లక్షలాది మంది విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. 

నాణ్యమైన విద్యే లక్ష్యం
► రాష్ట్రంలో నాన్‌ ప్రొఫెషనల్‌ కోర్సులు అందించే అన్ని డిగ్రీ కాలేజీలకూ నేషనల్‌ అసెస్‌మెంటు అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ (నాక్‌), నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడిటేషన్‌ (ఎన్‌బీఏ) సంస్థల నుంచి అత్యున్నత స్థాయి ర్యాంకుల గుర్తింపు ఉండాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ధేశించారు. 
► ఉన్నత ప్రమాణాలతో అటానమస్‌ సంస్థలుగా వాటిని తీర్చిదిద్దాలన్న సీఎం ఆదేశాల మేరకు.. ఆ దిశగా కాలేజీ విద్యకు కొత్త రూపునిస్తూ అధికారులు అనేక చర్యలు చేపట్టారు. ఇవన్నీ ఇప్పుడు విద్యార్థులకు అందుబాటులోకి రావడంతోపాటు కాలేజీల రూపురేఖలు మారేందుకు దోహద పడుతున్నాయి. 
► నాక్, ఎన్‌బీఏ గుర్తింపుతోపాటు నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)లోనూ కాలేజీలు నిలిచేలా చర్యలు చేపడుతున్నారు.

ఉపాధికి ఊతమిచ్చేలా కోర్సులు
► విద్యార్థులకు అండగా ఉండేలా వారికి భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా ప్రభుత్వం కాలేజీ విద్యలో అనేక కొత్త కోర్సులను ప్రారంభించింది. రాష్ట్రంలో 152 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 111 ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీలు, 1,022 ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 3,65,563 సీట్లుండగా.. 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు మాత్రమే సీట్లు భర్తీ అవుతున్నాయి. 
► కాలేజీ విద్యను పటిష్ట పరచడంలో భాగంగా ప్రమాణాలు పాటించని సంస్థల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా.. 30 మంది కన్నా తక్కువ చేరికలు ఉన్న కాలేజీలకు ముందుగా నోటీసులిచ్చి ఆ తర్వాత మూసివేతకు, కోర్సుల రద్దుకు ఆదేశాలిచ్చింది.
► ప్రభుత్వ కాలేజీల విషయంలో కూడా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే వారిని వేరే కాలేజీలకు తరలించేలా ఏర్పాట్లు చేసింది. అన్ని డిగ్రీ కోర్సులను ఆంగ్ల మాధ్యమంలోనే బోధించాలని నిర్ణయించి అమల్లోకి తెచ్చింది. పిల్లల చేరికలు లేనందున కొన్ని కాలేజీలు తెలుగు మాధ్యమ కోర్సులను రద్దు చేసుకున్నాయి.
► ఈ చర్యలన్నింటి వల్ల డిగ్రీతో పాటు నైపుణ్య శిక్షణ తప్పనిసరిగా ఇచ్చేందుకు పలు కాలేజీలు శ్రీకారం చుట్టాయి. తద్వారా రానున్న రోజుల్లో విద్యార్థులకు డిగ్రీ పూర్తి కాగానే ఉపాధి దొరికే అవకాశాలు బాగా పెరిగాయని నిపుణులు చెబుతున్నారు.  

ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ప్రతి విద్యార్థిని ఉన్నత ప్రమాణాలు, నైపుణ్యాలతో తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ దిశగా అన్ని కాలేజీల్లో ప్రమాణాలు ఉండేలా చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను ‘కాలేజీ విత్‌ పొటెన్షియల్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌’ (సీపీఈ)గా అభివృద్ధి పరుస్తున్నాం. జిల్లాకొక కాలేజీని సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌గా ఉండేలా చూస్తున్నాం. ప్రతి జిల్లాలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేశాం. సిస్కో అకాడమీస్‌ ద్వారా విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు ఏర్పాట్లు చేయించాం. సీమెన్స్‌ సంస్థ ద్వారా టెక్నికల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్లు ఏర్పాటయ్యాయి. పాలిటెక్నిక్‌ కాలేజీల్లో విద్యార్థులకు హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సదుపాయం, 500 డిజిటల్‌ తరగతులను సిద్ధం చేయించాం. డిగ్రీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ఇంటర్న్‌షిప్‌ను ప్రవేశపెట్టాం. 
– డాక్టర్‌ ఆదిమూలపు సురేష్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి   

మరిన్ని వార్తలు