అమ్మా నన్ను ఎందు‘కని’ పడేశారు..? 

25 Apr, 2021 11:50 IST|Sakshi
అంగన్వాడీ అధికారుల వద్ద ఉన్న ఆడ శిశువు

‘‘అమ్మా నన్ను ఎందుకని పడేశారు..? ఆడపిల్లగా పుట్టినందుకా.? లేక ఆర్థికంగా భారమవుతున్నందుకా.? నీ ఒడిలో ఉండాల్సిన నేను.. ఇలా అరటితోటలో పడిఉన్నానే.. నా ఈ దుస్థితికి కారణం ఎవరమ్మా..? ఏంటమ్మా?’’అని ప్రశ్నించలేని పసి మనసు తనది.  

రైల్వేకోడూరు రూరల్‌: అరటి తోటలో పడిఉన్న పసికందును ఐసీడీఎస్‌ అధికారులు అక్కున చేర్చుకున్నారు. ఈ సంఘటన రైల్వేకోడూరు మండలంలోని వీవీ కండ్రిక దళితవాడ సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు, ఐసీడీస్‌ సీడీపీఓ రాజమ్మ వివరాల మేరకు.. వీవీ కండ్రిక దళితవాడ సమీపంలో శనివారం తెల్లవారుజామున అరటి తోటలో చిన్నారి ఏడుపులు వినిపించాయి. దీంతో కౌలు రైతు చంద్ర పరుగున వెళ్లి చూడగా పసికందు కనిపించింది.

చంద్ర స్థానిక అంగన్వాడీ వర్కరు లక్ష్మీదేవికి, గ్రామస్తులకు సమాచారం అందించాడు. వారు ఆ బిడ్డను తీసుకెళ్లి రైల్వేకోడూరు పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో వైద్యం చేయించారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐ పెద్ద ఓబన్నకు విషయం తెలిపారు. ఈ ఘటనపై ఎస్‌ఐ మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డగా ఉందని, ఆడబిడ్డ కావడంతో ఎవరైనా పడేసి ఉంటారా? మరేమైనా జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తామన్నారు. శిశువును కడప రిమ్స్‌కు తీసుకెళ్లి మెరుగైన వైద్యం చేయించి, ఐసీడీఎస్‌ తరుఫున శిశు గృహలో చేర్పిస్తామని ఎస్‌ఐ తెలిపారు.

చదవండి: ప్రియుడి ఇంటి ముందు మౌనదీక్ష 
తీరానికి కొట్టుకొచ్చిన భారీ తాబేలు.. 

మరిన్ని వార్తలు