కొత్తగా 56 పీజీ వైద్య సీట్లు మంజూరు

30 Aug, 2020 04:18 IST|Sakshi

ఒక్క ‘అనంత’ వైద్య కళాశాలకే 41

తిరుపతి ఎస్వీఎంసీకి 13 జనరల్‌ మెడిసిన్‌ సీట్లు 

2020–21 విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి.. 

వచ్చే ఏడాది మరో 120 సీట్లకు దరఖాస్తు చేస్తామన్న వైద్య విద్యాశాఖాధికారులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ ఏడాది కొత్తగా 56 పీజీ వైద్యసీట్లు మంజూరయ్యాయి. 2020–21 విద్యా సంవత్సరం నుంచే ఇవి అమల్లోకి రానున్నాయి. ప్రైవేటు కళాశాలల్లో ఒక్కో సీటు కోట్లు పలుకుతున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ వైద్య కాలేజీల్లో పీజీ వైద్య సీట్లు పెంచడంపై వైద్య విద్యార్థులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. పీజీ వైద్య సీట్లు పెరగాలంటే వసతులు కల్పిస్తేగానీ భారతీయ వైద్య మండలి మంజూరు చేసే అవకాశం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో అనంతపురం మెడికల్‌ కాలేజీకి 41 సీట్లు మంజూరయ్యాయి. మరో 13 సీట్లు ఎస్వీ మెడికల్‌ కాలేజీ (తిరుపతికి)కి, మరో 2 సీట్లు గుంటూరు మెడికల్‌ కాలేజీకి మంజూరయ్యాయి. వీటిలో ఎక్కువ సీట్లు జనరల్‌ మెడిసిన్‌ కేటగిరీలో వచ్చాయి.

వచ్చే ఏడాది మరో 120 సీట్లు 
2021–22కి మరో 120 సీట్లకు దరఖాస్తు చేస్తున్నట్లు వైద్య విద్యాశాఖాధికారులు తెలిపారు. ఈ సీట్ల పెంపునకు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు వ్యయం చేస్తాయన్నారు. వివిధ కాలేజీల్లో స్పెషాలిటీ కోర్సుల కొరతను బట్టి సీట్లకు దరఖాస్తు చేస్తున్నామన్నారు. పీజీ వైద్య సీట్లు పెరగడంవల్ల వసతులతో పాటు, మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయి.

మరిన్ని వార్తలు