ఏపీలో ప్రారంభమైన రాత్రి కర్ఫ్యూ: రోడ్లన్నీ వెలవెల

24 Apr, 2021 22:33 IST|Sakshi
శ్రీకాకుళంలో బోసిపోయిన కూడలి.. బందోబస్తు పర్యవేక్షిస్తున్న పోలీసులు

సాక్షి, అమరావతి: మహమ్మారి కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ శనివారం ప్రారంభమైంది. రాత్రి పది గంటలకు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. కర్ఫ్యూ అమల్లోకి రావడంతో రోడ్లన్నీ వెలవెలబోయాయి. వాహనదారులు, ప్రజల ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ కర్ఫ్యూను పోలీసులు పక్కాగా అమలయ్యేలా చర్యలు చేపట్టారు. పలుచోట్ల పోలీస్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. అనవసరంగా బయటకు వచ్చిన వాహనదారులు, ప్రజలను ప్రశ్నించారు.

విశాఖపట్టణం, విజయవాడ, విజయనగరం, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, వైఎస్సార్‌ కడప, అనంతపురము, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు కర్ఫ్యూను పోలీస్‌ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కర్ఫ్యూ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. విశాఖపట్టణంలో రద్దీగా ఉండే ఆర్కే బీచ్, జగదాంబ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. నగరంలో 23 పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్... పెట్రోలింగ్ పార్టీలతో పాటు అదనపు బలగాలతో కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేస్తున్నారు. అన్ని దుకాణాలు మూసివేసి సహకరించాల్సిందిగా చిత్తూరు ఎస్పీ వెంకట అప్పలనాయుడు వ్యాపారులను విజ్ఞప్తి చేశారు.

విజయవాడలో..
విజయవాడ: బందరు రోడ్ పీవీపీ మాల్ వద్ద నైట్ కర్వ్యూను విజయవాడ పోలీస్ కమీషనర్ బత్తిన శ్రీనివాసులు పర్యవేక్షించారు. అత్యవసర సేవలకు మినహాయింపునిచ్చినట్లు తెలిపారు. కర్ఫ్యూకు విజయవాడ నగర ప్రజలు సహకరించాలని కోరారు. 70 పికెట్స్, 62 బీట్స్ ద్వారా రాత్రి పూట కర్వ్యూను పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. మొదటి రెండు రోజులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.



శ్రీకాకుళంలో తనిఖీలు చేస్తున్న పోలీసులు


శ్రీకాకుళం రోడ్డులో బోసిపోయిన ఓ కూడలి

మరిన్ని వార్తలు