నిమ్మగడ్డకు నో అపాయింట్‌మెంట్

31 Mar, 2021 04:21 IST|Sakshi

కలిసేందుకు విముఖత చూపిన గవర్నర్‌!

నేటితో ముగియనున్న నిమ్మగడ్డ పదవీకాలం  

సాక్షి, అమరావతి: గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు అపాయింట్‌ మెంట్‌ దొరకలేదు. నిమ్మగడ్డ పదవీకాలం బుధవారంతో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం గవర్నర్‌తో భేటీ అయ్యేందుకు అపాయింట్‌మెంట్‌ కోరుతూ నిమ్మగడ్డ నాలుగు రోజుల క్రితమే రాజ్‌భవన్‌ కార్యాలయ అధికారులకు తెలియజేశారు. అయితే నిమ్మగడ్డను కలిసేందుకు గవర్నర్‌ ఆసక్తి చూపలేద ని సమాచారం. మంగళవారమంతా కమిషన్‌ కార్యాలయంలో ఉన్న నిమ్మగడ్డ గవర్నర్‌ కార్యాలయం నుంచి పిలుపుకోసం ఎదురుచూశారు.

కానీ పిలుపు రాకపోవడం తో రమేష్‌ తీవ్ర నిరాశకు గురయ్యారని సమాచారం. మార్చి 19న తనను అత్యవసరంగా కలవాలంటూ ఒకరోజు ముందు గానే గవర్నర్‌ సమాచారమిచ్చినప్పటికీ.. తాను హైదరాబాద్‌లో ఉన్నానంటూ నిమ్మగడ్డ ఆయన్ను కలవని విషయం తెలిసిందే. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను మార్చి నెలాఖరులోగా పూర్తిచేసే అంశంపై చర్చించేందుకే గవర్నర్‌ అత్యవసరంగా 19న తనను కలవాలని ఎస్‌ఈసీని ఆదేశించగా, తన హయాంలో ఆ ఎన్నికలు జరిపేందుకు ఏమా త్రం ఆసక్తిగా లేని నిమ్మగడ్డ ఏవో కారణాలు చెప్పి అప్పుడు ఆయన్ని కలవలేదన్న విమర్శలున్నాయి. 
(చదవండి: ఎన్నికలకు టైం లేదు!)

మరిన్ని వార్తలు