‘కొత్త చట్టాలతో దళారులకే నష్టం.. రైతులకు కాదు’

7 Oct, 2020 19:35 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఎన్నికల హామీలను పూర్తిగా నిలబెట్టుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆలోచన చేస్తున్నారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అందులో భాగంగానే వ్యవసాయ బిల్లులు తీసుకువచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. నిర్మలా సీతారామన్‌ నేడు (బుధవారం) విజయవాడలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రైతులు, వ్యవసాయ రంగం నిపుణులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు సునీల్ దేవధర్, జీవీఎల్, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్ హాజరయ్యారు. ఐసోలేషన్‌లో ఉన్న కారణంగా ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. చదవండి: 'సంస్కరణల ద్వారానే రైతులకు మేలు'

ఈ సందర్భంగా నిర్మలా మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందనేది తప్పుడు ప్రచారమని అన్నారు. మార్కెట్ కమిటీలను తొలగిస్తామని కాంగ్రెస్ చెప్పిందా లేదా అని ప్రశ్నించారు. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్లి కాయగూరలు, పళ్ళు అమ్ముకుంటే ఏంటి అభ్యంతరం అని నిలదీశారు.మార్కెట్ యార్డుల పన్ను, మధ్యవర్తుల పన్ను రైతులపై భారంగా ఉందని, కొత్త చట్టాలతో మార్కెట్‌కు వెళ్ళకుండానే సరుకు అమ్ముకోవచ్చని తెలిపారు. కొత్త చట్టాలతో దళారులకే నష్టమని, రైతులకు కాదని స్పష్టం చేశారు. కష్టపడి పంట పండించే రైతుకు మంచి ధర ఇవ్వాల్సిందేనని తెలిపారు. అతి తక్కువ వర్ష పాతం ఉండే ఖచ్ ప్రాంతంలో ఎక్కువ హార్టికల్చర్ పండుతోందని, డ్రిప్ వల్లనే ఇది సాధ్యం అయ్యిందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు