రాయలసీమ ప్రగతికి మరో ‘హైవే’.. రూ.1,500.11 కోట్లతో 4లేన్ల రహదారి

2 Dec, 2022 08:12 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాయలసీమ ప్రగతి పథానికి మరో జాతీయ రహదారి దోహదపడనుంది. కడప–రేణిగుంట మధ్య నాలుగు లేన్ల జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–716)ని నిరి్మంచాలని కేంద్ర రవాణా–జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ నిర్ణయించింది. దేశంలోని పశ్చిమ–తూర్పు ప్రాంతాలను అనుసంధానిస్తూ నిర్మించనున్న షోలాపూర్‌–చెన్నై ఎకనామిక్‌ కారిడార్‌లో భాగంగా ఈ రహదారిని నిర్మించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర రవాణా–జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ గురువారం ట్వీట్‌ ద్వారా వెల్లడించారు.  

120 కి.మీ.. రహదారి 
దేశంలో మౌలిక సదుపాయాల అనుసంధానానికి కేంద్రం ప్రారంభించిన గతి శక్తి ప్రాజెక్టులో భాగంగా కడప నుంచి తిరుపతి సమీపంలోని రేణిగుంట కూడలి మధ్య నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేను నిర్మిస్తారు. రూ. 1,500.11 కోట్లతో 120 కి.మీ. రహదారి నిర్మాణానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ హైవే నిర్మాణానికి అవసరమైన 1,066 ఎకరాల సేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వేగవంతం చేసింది. రెండు ప్యాకేజీల కింద టెండర్ల ప్రక్రియ నిర్వహించి 2024 నాటికి హైవేను పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

చదవండి: (వైఎస్సార్‌ జిల్లా పేరు మారుస్తా: చంద్రబాబు)

పోర్టుల అనుసంధానం.. 
ఈ నాలుగు లేన్ల రహదారి ప్రధానంగా వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలను రేణిగుంట విమానాశ్రయంతో అనుసంధానిస్తుంది. ఈ రహదారి నిర్మాణంతో నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు, చెన్నై పోర్టుల నుంచి షోలాపూర్‌ పారిశ్రామిక ప్రాంతానికి సరుకు రవాణా సులభతరం కానుంది. దీంతో ఈ మధ్య ప్రాంతంలో ఉండే రాయలసీమలో అనుబంధ పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ యూనిట్ల ఏర్పాటుకు అవకాశాలు పెరుగుతాయి.

ప్రస్తుతం రోజూ సగటున 18 వేల వాహనాలు ప్రయాణిస్తున్న ఈ మార్గంలో తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నాలుగు లేన్ల జాతీయ రహదారితో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్‌ జిల్లాల్లో ఆధ్యాత్మిక టూరిజం కూడా అభివృద్ధి చెందనుంది. 

మరిన్ని వార్తలు