రేపు రాష్ట్రంలో కేంద్రమంత్రి గడ్కరీ పర్యటన

16 Feb, 2022 03:40 IST|Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌తో కలిసి రహదారులు, ఇతర ప్రాజెక్టుల ప్రారంభం, భూమిపూజ

విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ పశ్చిమ ఫ్లై ఓవర్‌ ప్రారంభం

సాక్షి, అమరావతి: కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ రేపు (గురువారం) రాష్ట్రంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కేంద్రమంత్రి గడ్కరీ గురువారం ఉదయం 11.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని నేరుగా విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియానికి వస్తారు. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ రాష్ట్రంలో రూ.11,157 కోట్లతో నిర్మించిన 20 రహదారులు, ఇతర ప్రాజెక్టులను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి ప్రారంభిస్తారు. రూ.10,401 కోట్లతో నిర్మించనున్న 31 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు భూమిపూజ చేస్తారు.

ఈ సందర్భంగా స్టేడియంలో నిర్వహించే బహిరంగసభలో  కేంద్రమంత్రి గడ్కరీ, సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. అనంతరం బెంజ్‌ సరిŠక్ల్‌కు చేరుకుని కొత్తగా నిర్మించిన పశ్చిమదిశ ఫ్లై ఓవర్‌ను ప్రారంభిస్తారు. అనంతరం కేంద్రమంత్రి సీఎం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయానికి చేరుకుని రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. కేంద్రమంత్రి గౌరవార్థం ముఖ్యమంత్రి విందు సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కేంద్రమంత్రి గడ్కరీ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. అనంతరం విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. సాయంత్రం 5.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని నాగ్‌పూర్‌కు ప్రయాణమవుతారు. కేంద్రమంత్రి పర్యటన, బహిరంగసభ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది.  

మరిన్ని వార్తలు