తిరుపతిలో బీజేపీకి అంత సీన్‌ లేదు..!

22 Jan, 2021 09:07 IST|Sakshi

పవన్‌ కల్యాణ్‌తో జనసేన పార్టీ నేతలు

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌: తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని కచ్చితంగా పోటికి దింపాలని జనసేన నాయకులు పవన్‌కల్యాణ్‌పై ఒత్తిడి చేసినట్లు తెలిసింది. బీజేపీకి సీటు కేటాయించి వారికి సహకరించాలంటే జరిగే పరిణామాలు వేరుగా ఉంటాయని వారు పేర్కొన్నట్లు సమాచారం. తిరుపతిలో గురువారం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. అనంతరం పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. వారితో చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పవన్‌‌ కల్యాణ్‌కు వాస్తవ పరిస్థితులు వివరించారు. తిరుపతిలో బీజేపీకి గెలిచే సీన్‌ లేదని చెప్పినట్లు తెలిసింది. బీజేపీ అభ్యర్థికి ఎట్టి పరిస్థితుల్లోనూ  తాము సహకరించబోమని వారు తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతోపాటు తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సహకరించిన నేపథ్యంలో తిరుపతిలో మనమే పోటీ చేద్దామని తేల్చిచెప్పినట్లు ఆ పార్టీ నాయకులు చెప్పినట్లు ఆ పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు. అయితే అంతకుముందు పీఏసీ సమావేశంలో కూడా దీనిపై చర్చించినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు