50 ఏళ్లు పైబడిన వారు హోమ్‌ ఐసోలేషన్‌లో వద్దు

19 Aug, 2020 07:43 IST|Sakshi

చిత్తూరు కలెక్టరేట్‌: జిల్లాలో కరోనా వైరస్‌ సోకి 50 ఏళ్లు పైబడిన వారు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండకూడదని కలెక్టర్‌ నారాయణభరత్‌గుప్తా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి వైద్యశాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పాజిటివ్‌ కేసు నమోదైన వెంటనే కాంటాక్ట్‌ల గుర్తింపుపై దృష్టి పెట్టాలన్నారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను త్వరితగతిన గుర్తించాలన్నారు. జిల్లాలో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న వారి వివరాలను ప్రతి మండలంలో ఉన్న కంట్రోల్‌ రూమ్‌కు తెలియజేయాలన్నారు.

ఈ సమాచారాన్ని పంచాయతీ సెక్రటరీ మానిటరింగ్‌ చేయాలని ఆదేశించారు. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏఎన్‌ఎంలు అవగాహన కల్పించాలన్నారు. కేసుల తీవ్రతలను బట్టి స్విమ్స్, రుయాకు పంపే ముందు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. బాధితులకు వెంటనే వైద్యం అందించి ప్రాణాలను కాపాడేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి పీహెచ్‌సీ పరిధిలో ఇప్పటివరకు జరిగిన కోవిడ్‌ మరణాల పూర్తి స్థాయి నివేదికలను పంపాలని ఆదేశించారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) వీరబ్రహ్మం, జిల్లా నోడల్‌ అధికారి చంద్రమౌళి, డీఎంఅండ్‌హెచ్‌ఓ పెంచలయ్య స్విమ్స్, రుయా సూపరింటెండెంట్లు డాక్టర్‌ రామ్, డాక్టర్‌ భారతి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు