ఆక్సిజన్‌ అందక కర్నూలులో ఐదుగురు మృతి

1 May, 2021 16:12 IST|Sakshi

సాక్షి, కర్నూలు: కర్నూలులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. అనుమతి లేకుండానే కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురు ఆక్సిజన్‌ అందక మృతి చెందారు. ఈ సంఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే స్పందించిన కలెక్టర్‌ ఆస్పత్రిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై విచారణ చేపడుతున్నట్లు కర్నూలు కలెక్టర్‌ తెలిపారు. కర్నూలులోని కేఎస్‌ కేర్‌ ఆస్పత్రిలో కరోనా చికిత్సకు అనుమతి లేదు. అయినా కూడా నిబంధనలకు విరుద్ధంగా కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆక్సిజన్‌ అందక ఐదుగురు మృతి  చెందారు. అనుమతి లేకుండానే కోవిడ్ చికిత్స చేస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. కేఎస్‌ కేర్‌ ఆస్పత్రిలో కోవిడ్‌ వైద్యానికి అనుమతి లేదు కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఘటనపై డీఎంహెచ్‌ఓ విచారణ చేస్తున్నారు.

కోవిడ్ ఆస్పత్రిగా నోటిఫైడ్ చేయని కేఎస్కేర్ ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా బాధితులు ఆక్సిజన్ అందక చనిపోయారనితెలుసుకుని డీఎంహెచ్ఓ డాక్టర్‌ రామగిడ్డయ్య విచారణ మొదలు పెట్టారు. కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాల మేరకు అధికారులు ఆస్పత్రికి వెళ్లారు. కేఎస్‌కేర్ ఆస్పత్రిలో ఉన్న బాధితులందరినీ అంబులెన్స్‌లో కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు. అనుమతి లేకుండా కోవిడ్ పేషేంట్స్‌ను అడ్మిట్ చేసుకుని అనధికారికంగా ట్రీట్మెంట్ ఇచ్చిన ఆస్పత్రి యజమాన్యంపై క్రిమినల్ కేసు బుక్ చేశారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం తదుపరి చర్యలు చేపడతామని కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా, ఎవరైనా ప్రభుత్వం/జిల్లా యంత్రాంగం అనుమతి లేకుండా అనధికారికంగా కోవిడ్ ఆస్పత్రులు లేదా కోవిడ్ కేర్ సెంటర్స్ నడిపితే క్రిమినల్ కేస్ పెడతాం... సీజ్ చేయిస్తామని కలెక్టర్ వీరపాండియన్ హెచ్చరించారు.

చదవండి: ‘భారత్‌ కోలుకో’: నయాగారా జలపాతం త్రివర్ణశోభితం
చదవండి: ఈటల మాట ఎత్తకుండానే టీఆర్‌ఎస్‌ ప్రెస్‌మీట్‌

మరిన్ని వార్తలు