పవన్ దివీస్‌‌ పర్యటనకు నో  పర్మిషన్‌..

8 Jan, 2021 19:50 IST|Sakshi

తూర్పుగోదావరి ఎస్పీ న‌యీం అస్మీ 

సాక్షి, కాకినాడ: తూర్పుగోదావ‌రి జిల్లా తొండంగి మండ‌లం దివీస్‌ ల్యాబ‌రేట‌రీ ప‌రిస‌ర ప్రాంతాల్లో పోలీస్ సెక్ష‌న్ 144 అమ‌లులో ఉన్నందున జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ప‌ర్య‌ట‌నకు అనుమ‌తి నిరాక‌రించామ‌ని జిల్లా ఎస్పీ న‌యీం అస్మీ తెలిపారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్ట‌ర్స్ ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ, తుని రైలు కాల్చివేత‌, ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కాపు ఉద్య‌మం, దివీస్ ల్యాబ‌రేట‌రీపై దాడి ఘ‌ట‌న‌లు నేప‌థ్యంలో ముంద‌స్తు చ‌ర్య‌గా సున్నిత ప్ర‌దేశాల్లో ఎవ‌రికీ అనుమ‌తులు ఇవ్వ‌డం లేద‌ని తెలిపారు. శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగిస్తే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఎస్పీ నయీం అస్మీ హెచ్చరించారు. (చదవండి: ఏ మతం హింసను ప్రేరేపించదు: మత పెద్దలు)

సంపాదిపేట దివీస్ ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ నిర్మాణం వద్ద గత ఏడాది డిసెంబర్‌లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉంది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రజల అభ్యంతరాలు, సందేహాల నివృత్తి జరిగే వరకూ 'దివీస్' ఒక్క ఇటుక కూడా కదపకూడదని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి స్పష్టం చేయడంతో పాటు రైతులు, మత్స్యకారులు, స్థానికుల ఆందోళనకు గల కారణాలపై 'దివీస్' యాజమాన్యంతో ఆయన చర్చించిన సంగతి తెలిసిందే.. కాలుష్య నివారణకు చర్యలు, ఉద్యోగాల్లో స్థానికులకు పెద్దపీట, ఆందోళనకారులపై మోపిన కేసుల ఉపసంహరణ వంటి అనేక సున్నిత అంశాలలో ప్రజాక్షేమం కోసం ప్రతిపాదనలు చెబుతూ ప్రభుత్వం దివీస్‌తో చర్చలు జరిపిన సంగతి విధితమే.

మరిన్ని వార్తలు