అనిల్‌తో విభేదాలు లేవు.. లేని వాటిని సృష్టించకండి: మంత్రి కాకాణి

20 Apr, 2022 18:19 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా నేతలతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ ముగిసిన అనంతరం.. మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడారు. 

సీఎంను కలవడంలో పెద్ద విశేషం లేదన్న కాకాణి.. అభివృద్ధి, సంక్షేమం, జిల్లా పనులకు సంబంధించే విషయాలపైనే చర్చించడం జరిగిందని చెప్పారు. కొత్త జిల్లాల ఇంఛార్జిల నియామకం నేపథ్యంలోనే ఈ భేటీ జరిగిందన్నారు. ‘మా జిల్లా అభివృద్ధి విషయాలపై సీఎంతో చర్చించాం. అందరూ కలిసి సమన్వయంతో పనిచేయాలని సీఎం జగన్‌ చెప్పారు. మా మధ్య విభేదాలు ఉంటే కదా చర్చించడానికి!..

అనిల్‌తో విభేదాలన్నది మీడియా సృష్టే...పార్టీ కోసం అందరం కలిసి పనిచేస్తాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడూ అనిల్, నేను కలిసే పనిచేశాం. అనిల్ నాకు సోదరుడి లాంటి వాడు. కావాలనే  మా మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం చేశారు’’ అని పేర్కొన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి.

మరిన్ని వార్తలు