‘దృష్టిమళ్లించేందుకే చంద్రబాబు కట్టుకథలు’

18 Aug, 2020 21:06 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి టీడీపీ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణల నేపథ్యంలో అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కోరి 24 గంటలు గడిచినా ఏ ఆధారాలు సమర్పించలేకపోయారని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. హోంమంత్రిగా తాను, రాష్ట్ర డీజీపీకి విజ్ఞప్తిచేసి 24 గంటలు గడిచిపోయిందని, అయినా ఈ క్షణం వరకూ ఎటువంటి ఆధారాలూ సమర్పించలేకపోయారని పేర్కొన్నారు. అయితే కొన్ని మీడియా సంస్థలతో కలిసి వారు చేస్తున్న ఒక కుట్రపూరితమైన ప్రచారం వెనుక ఏ వ్యూహం దాగిఉందన్న అంశాన్ని రాష్ట్ర ప్రజలముందు ఉంచటం తన విధిగా భావిస్తున్నానని ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. (బాబు అక్రమాల కేసు గిన్నిస్‌ రికార్డు లెవల్లో..)

‘మీ అందరికీ తెలుసు. అమరావతిలో చంద్రబాబునాయుడు, ఆయన బినామీలు, ఆయన సన్నిహితులు ఎంతటి భారీ కుంభకోణానికి పాల్పడ్డారన్నది. అయితే అందుకు సంబంధించి పూర్తిస్థాయి విచారణను మేం అధికారంలోకి రాగానే చేపడతామని చెప్పిన మేరకు రాష్ట్ర పోలీసులోని సంబంధిత విభాగాలు ఈ విషయంపై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. విచారణను ఒక కొలిక్కి తీసుకు వస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు, ఆయన బినామీలు ఈ నివేదికలో నిజాలను ప్రజలకు తెలియకుండా మరుగుపరచాలన్న దురుద్దేశంతో పెద్ద కుట్రకు తెరతీసినట్టుగా మాకు కనిపిస్తోంది. ఇంటా, బయటా తనకున్న పరిచయాలను, తనకు సహకరించే వారిని ఉపయోగించుకుంటూ, మీడియా సంస్థలతో కలిసి చేస్తున్న ఈకుట్ర వల్ల ఆయన పొందాలనుకుంటున్న ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లో పొందలేరని స్పష్టంచేస్తున్నాను.(రాష్ట్రానికి చంద్రబాబు ద్రోహం)

అమరావతి భూముల చుట్టూ అసలైన కుంభకోణాన్ని వెలికి తీయకుండా నిరోధించేందుకు, దర్యాప్తు ముందుకు సాగనీయకుండా అడ్డుకునేందుకు, పోలీసు, ప్రభుత్వ యంత్రాంగం మీద ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణల ద్వారా వారిని లక్ష్యంగా చేసుకున్నారు. వారి స్థైర్యాన్ని దెబ్బతీయాలనే ఈ కుట్రపూరిత వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో చంద్రబాబు మీడియా భాగస్వాములు, మరికొందరు ఇంటా, బయటా సహకరించే వ్యక్తులు ఉన్నారని అందరికీ అర్థమవుతోంది. కాబట్టి చట్టవిరుద్ధమైన ఫోన్‌ ట్యాపింగ్‌ జరుగుతుందనేది అబద్ధం. ఈ విషయాలు అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాను. అమరావతి ల్యాండ్‌ స్కాంనుంచి తప్పించుకునేందుకు ఇటువంటి ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు, ఆయన బినామీలు, ఆయన సన్నిహితులు తప్పించుకోలేరని, అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరని స్పష్టంచేస్తున్నాను’ అని సుచరిత పేర్కొన్నారు.(ఫోన్‌ ట్యాపింగ్‌పై విచారణ 20 కి వాయిదా)

మరిన్ని వార్తలు