ప్రేమ జంటను విడదీసిన విధిరాత

23 Jul, 2022 07:51 IST|Sakshi

తూర్పు గోదావరి (పిఠాపురం): డిగ్రీ పూర్తి చేసుకున్న యువకుడు, ఇంటర్‌ చదివిన యువతి ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను పెద్దలు అంగీకరిస్తారో లేదో అన్న అనుమానంతో తామే పెళ్లి చేసుకుని ఒక్కటవ్వాలని బయలుదేరారు. కానీ రోడ్డు ప్రమాద రూపంలో విధి వారిని విడదీసింది. పిఠాపురం సమీపంలో రాపర్తి సెంటర్‌ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రేమ జంట తీవ్ర గాయాల పాలవ్వగా ప్రియుడు మృతి చెందాడు. ప్రియురాలు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. 

పిఠాపురం పట్టణ ఎస్సై శంఖరరావు తెలిపిన వివరాల ప్రకారం కాకినాడ జగన్నాథపురానికి చెందిన పాలెపు గణేష్‌ అదే ప్రాంతానికి చెందిన దీప్తి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. గురువారం రాత్రి తాము అన్నవరం వెళ్లి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా రు. మోటారుసైకిల్‌పై గురువారం అర్ధరాత్రి బయలు దేరారు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో పిఠాపురం రాపర్తి సెంటర్‌కు వచ్చే సరికి  216 జాతీయ రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను వీరి వాహనం బలంగా ఢీకొంది.

దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. పెట్రోలింగ్‌ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి 108లో తరలించారు.  గణేష్‌ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. దీప్తి చికిత్స పొందుతోంది. కాగా తమ కుమారుడిని ఎవరో వ్యక్తులు చంపేశారని మృతుడి తల్లి లక్ష్మి పిఠాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

మరిన్ని వార్తలు