కొత్త విద్యుత్‌ ప్రాజెక్టులకు లక్ష ఎకరాలు 

27 Jul, 2020 03:22 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంధన ఎగుమతి విధానాన్ని (ఎక్స్‌పోర్ట్‌ పాలసీ) దృష్టిలో ఉంచుకుని 1,00,611.85 ఎకరాలను గుర్తించినట్టు సంప్రదాయేతర, పునరుత్పాదక వనరుల సంస్థ (నెడ్‌క్యాప్‌) ఎండీ రమణారెడ్డి తెలిపారు. ఈ భూమిని ఎకరా ఏడాదికి రూ.31 వేలకే లీజుకిస్తామన్నారు. రెండేళ్లకోసారి 5 శాతం లీజు పెంచుతామని చెప్పారు. ఈ మేరకు ‘సాక్షి’కి వివరించారు.  

► ఏపీలో 4 వేల మెగావాట్ల సౌరశక్తి ప్లాంట్లు నెలకొల్పేందుకు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెకీ), 5 వేల మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు జాతీయ థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ (ఎన్టీపీసీ)లు ఆసక్తి చూపుతున్నాయి. 
► డెవలపర్‌ ఏ ప్రాంతంలోనైనా ప్లాంటు పెట్టుకోవచ్చని, ఆన్‌లైన్‌లోనే నెడ్‌క్యాప్‌ పరిశీలించి అనుమతిస్తుంది. పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ అల్ట్రా మెగా రెన్యూవబుల్‌ ఎనర్జీ పవర్‌ పార్కులను ప్రతిపాదించిందన్నారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో 3 నుంచి 5 వేల మెగావాట్ల సామర్థ్యం గల పార్కులను సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో త్వరలోనే 24 వేల మెగావాట్లు సోలార్, విండ్‌ ఉత్పత్తి జరుగుతుందని, ఫలితంగా చౌక విద్యుత్‌ లభించేందుకు ఏపీ కేంద్రం కాబోతోంది. 

మరిన్ని వార్తలు