West Godavari: ఒకరిద్దరిని కాదు ఏడుగురిని పెళ్లి చేసుకున్న మహిళ..

1 Oct, 2022 10:25 IST|Sakshi

డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ): ఒకరిద్దరిని కాదు ఏడుగురిని పెళ్లి చేసుకుంది ఆ కిలాడీ లేడీ. డబ్బున్న వారిని గుర్తించడం. వారి చెంత చేరడం. మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకోవడం ఆమెకు అలవాటు. గుంటూరు, భీమవరం, శారదానగర్, విజయవాడ ప్రాంతాలకు చెందిన వ్యక్తులను మోసం చేసినట్టు బాధితుడు కొత్తకోట నాగేశ్వరరావు (శివ) తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం పేకేరు గ్రామానికి చెందిన రోకళ్ల వెంకటలక్షి్మ(అలియాస్‌ గుంటూరు కందుకూరి నాగలక్షి్మ) అతని వద్ద పనికి చేరింది. 

అతనికి దగ్గరవ్వడమే గాక 2021 మార్చి 13న గుంటూరులో వివాహం చేసుకుంది. ఇద్దరూ విశాఖపట్నం చేరుకొని.. జగదాంబ జంక్షన్‌ సమీపంలో ఓ ఇంట్లో అద్దెకు ఉన్నారు. అతను ఓ కంపెనీలో ఆడిటర్‌గా పనిచేసేవాడు. వెంకటలక్ష్మి మాయ మాటలు చెప్పి ప్రతీ నెలా జీతాన్ని తన అకౌంట్‌ నుంచి ఆమె అకౌంట్‌కు బదిలీ చేసుకునేది. పిత్రార్జితంగా వచ్చిన గుంటూరు జిల్లాలోని గోరింట్ల వద్ద డాబా ఇల్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలోని 12 సెంట్ల ఖాళీ స్థలం ఆమె పేరిట మారి్పంచుకుంది. 

ఆరు నెలల గర్భంతో ఉన్న సమయంలో 3 తులాల బంగారం, బ్యాంకు అకౌంట్‌లో ఉన్న సొమ్ము తీసుకొని అతనిని వదిలి వెళ్లిపోయింది. ఈ విషయమై గుంటూరు,  భీమవరం పోలీస్‌ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాను. అనంతరం ఆమె గురించి అనేక వివరాలు వెలుగులోకి వచ్చాయి. భీమవరంలో ఇద్దరు, పాత గుంటూరులో ఒకరు, గుంటూరు శారదానగర్‌లో ఒకరు, విజయవాడ రాజరాజేశ్వరిపేటలో ఒకరు, గుంటూరు డొంకరోడ్డులో రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగిని మోసగించినట్లు తేలింది.   

మరిన్ని వార్తలు