రూ.70,983.11కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌

29 Mar, 2021 02:48 IST|Sakshi

బడ్జెట్‌ ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదంతో న్యాయశాఖ గెజిట్‌ 

శాఖలవారీగా మూడు నెలల వ్యయానికి ఆర్థిక శాఖ జీవో  

సాక్షి, అమరావతి: రానున్న ఆర్థిక సంవత్సరం 2021 – 22లో తొలి మూడు నెలల (ఏప్రిల్‌ – జూన్‌) కాలానికి వివిధ శాఖలు, రంగాల వారీగా వ్యయానికి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో రూ.70,983.11 కోట్లను కేటాయించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను మార్చిలో నిర్వహించడం సాధ్యం కాలేదు. మరోవైపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఇంకా మిగిలిపోయి ఉండటం, కోవిడ్‌ – 19 వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో 2021 – 22 తొలి మూడు నెలల ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఆర్డినెన్స్‌ జారీకి శుక్రవారం కేబినెట్‌ ఆమోదం తెలిపి గవర్నర్‌కు పంపగా ఆదివారం ఆయన ఆమోదముద్ర వేశారు. దీంతో న్యాయశాఖ ఆర్డినెన్స్‌ గెజిట్‌ పబ్లికేషన్‌ జారీ చేసింది.

ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు అన్ని రంగాల వ్యయానికి సంబంధించి ఓటాన్‌ అకౌంట్‌ కేటాయింపులతో ఆదివారం జీవో జారీ చేసింది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఆర్ధిక సంవత్సరంలో తొలి మూడు నెలలకు రూ.70,983.11 కోట్ల వ్యయం అవుతుందని కానుందని ఓటాన్‌ అకౌంట్‌లో పేర్కొన్నారు. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు నవరత్నాలకు సంబంధించి వివిధ పథకాలకు ఓటాన్‌ అకౌంట్‌లో వ్యయాలను ప్రతిపాదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సేవల కోసం అదనంగా రూ.7,955.66 కోట్లను మంజూరు చేస్తూ ఆర్డినెన్స్‌కు కూడా గవర్నర్‌ ఆమోదం తెలపడంతో ఆర్థిక శాఖ జీవో జారీ చేసింది.

మరిన్ని వార్తలు