సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని బీజేపీ నేతలతో తనకు పెద్దగా పరిచయమే లేదని.. తనకున్న సంబంధాలన్నీ ఢిల్లీ నేతలతోనే అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ వ్యాఖ్యానించారు. శనివారం జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా శుక్రవారం మీడియా ప్రతినిధులతో ఆయన చిట్చాట్గా మాట్లాడారు. 2007 నుంచే తనకు ఢిల్లీ బీజేపీ నేతలతో సంబంధాలు ఉన్నాయన్నారు. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును కూడా 2014లోనే తాను తొలిసారి కలిశానన్నారు. కోనసీమ అల్లర్ల వ్యవహారంలో డీజీపీ వైఖరిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు లేఖ రాస్తామన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నంతవరకు పోలవరం నిర్మాణం పూర్తవదని పేర్కొన్నారు.