‘అవినీతికి తావు లేకుండా సేవలను అందిస్తున్నాం’

1 Oct, 2020 14:07 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించి శుక్రవారంతో ఏడాది పూర్తవుతుందని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ప్రతి ఇంటి ముందుకు ప్రభుత్వ పాలనను తీసుకువెళ్లాలి అనే ఉద్దేశంతో ఈ సచివాలయ వ్యవస్థ ప్రారంభించడం జరిగింది అని పేర్కొన్నారు. గురువారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ‘అవినీతికి తావు లేకుండా 543 సేవలను ఈ రోజు గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు అందిస్తున్నాం. అవినీతి రహిత పాలనను ఈ ప్రభుత్వం అందిస్తోంది.  సచివాలయ పనితీరుని మన దేశ ప్రధాని నరేం‍ద్రమోదీ అభినందించారు. కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ కూడా ప్రత్యేకంగా మన సచివాలయ వ్యవస్థని అభినందించారు. 

యూపీఎస్సీ ట్రైనింగ్ సెంటర్ లో ఒక పాఠ్యాంశంగా మన సచివాలయ వ్యవస్థని చేర్చారు. 61,65,000ల మందికి పెన్షన్లు గత నెల వరకు ఇస్తున్నాం. 34,907 మందిని గత నెల కొత్తగా పెన్షన్ ఇచ్చే జాబితాలో చేర్చాం. గత ప్రభుత్వం లాగా కాకుండా మా ప్రభుత్వంలో ఈ పెన్షన్‌ల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. 1,26,200 మంది ఇప్పటి వరకు గ్రామ సచివాలయల్లో పనిచేస్తున్నారు. 4 లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానిది. రేపు గ్రామ సచివాలయ ఉద్యోగులను అభినందించేందుకు సాయంత్రం 7 గంటలకు అందరూ ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి అభినందించాలని కోరుతున్నాను. ఎప్పుడో 11 ఏళ్ల క్రితం సస్పెండ్ అయిన జడ్జ్ ద్వారా దళితులలో లబ్ది పొందాలి అని చంద్రబాబు చూస్తున్నారు’ అని అన్నారు. చదవండి: ఏపీ: పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం

మరిన్ని వార్తలు