‘వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి’

2 Sep, 2021 15:40 IST|Sakshi
ఫైల్ ఫోటో

సాక్షి, చిత్తూరు: పేద ప్రజల గుండె చప్పుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనియాడారు. వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మంత్రి పెద్దిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని గుర్తుచేశారు. అన్ని వర్గాలకు మేలు చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. వైఎస్సార్‌ చూపిన బాటలో సీఎం వైఎస్‌ జగన్‌ నడుస్తున్నారని పెద్దిరెడ్డి తెలిపారు.

సాక్షి, పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లాలోని దుగ్గిరాల గ్రామంలో అంబేద్కర్, వైఎస్సార్‌ విగ్రహాలను మంత్రి ఆళ్ల నాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తర్వాత పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్న నాయకుడు  సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. కరోనాను కట్టడి చేస్తూ సీఎం జగన్‌ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారమే సీఎం జగన్‌ పేదలకు సంక్షేమన్ని చేరువచేశారని కొనియాడారు. 

ఈ సందర్బంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మనందరికీ దూరమై నేటికీ 12ఏళ్లు గడిచాయని, ఆయన ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పధకాలతో చెరగని ముద్ర వేశారని గుర్తుచేశారు. పేదలకు కుల, మత, పార్టీ, బేధం లేకుండా సంక్షేమ పాలన అందించారని కొనియాడారు. భావితరాల భవిష్యత్‌ను ఉద్దేశించి సీఎం జగన్‌ పాలన అందిస్తున్నారని తెలిపారు. సీఎం జగన్‌ అంబేద్కర్ ఆశయాల అనుగుణంగా పాలన సాగిస్తున్నారని తెలిపారు.

మేనిఫెస్టోలో 90 శాతం పథకాలు అమలు చేసిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కు దక్కుతుందని పేర్కొన్నారు. దెందులూరు నియోజకవర్గంలో రూ. 750 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని, రూ.100కోట్లతో రూర్బన్ కింద 15కొల్లేరు గ్రామాల రూపురేఖలు మారబోతోన్నాయని తెలిపారు. రూ.240 కోట్లతో ఆర్అండ్‌బీ కింద పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ మోషేన్ రాజు మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాల సాధనకు అనుగుణంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని అన్నారు. పేదల గుండె చప్పుడు  వైఎస్‌ రాజశేఖరరెడ్డి బాటలో.. బడుగు, బలహీన వర్గాలకు సీఎం జగన్‌ అండగా నిలుస్తున్నారని చెప్పారు.

అదేవిధంగా ఎమ్మెల్యే వాసుబాబు మాట్లాడుతూ.. దుగ్గిరాల గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్, వైఎస్సార్‌ విగ్రహన్ని ప్రారంభించడం శుభపరిణామమని అన్నారు. సంక్షేమ పాలనలో సువర్ణ అధ్యాయం వైఎస్సార్‌ పాలన అని కొనియాడారు.

మరిన్ని వార్తలు