‘రాజకీయ దురుద్దేశంతోనే ఆరోపణలు’

25 Mar, 2021 12:13 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాజకీయ దురుద్దేశంతోనే ఇసుక టెండర్లపై టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలోనే ఇసుక దోపిడీ జరిగిందని, విచ్చల విడిగా ఇసుకను దోచుకున్నారని ఆరోపించారు. ఇసుక టెండర్లలో టీడీపీ నేతలు ఎందుకు పాల్గొనలేదని ఆయన ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ద్వారానే టెండర్లు పిలిచామన్నారు. రూ.120 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్‌ చేసిన సంస్థ దివాళా తీసిందని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. వినియోగదారులకు సక్రమంగా ఇసుక సరఫరా అందిస్తున్నామని, సొంతంగా వినియోగదారులే ఇసుక తరలించేందుకు అవకాశం కల్పించామని చెప్పారు. అలాగే ఇసుక అక్రమాలపై ఫిర్యాదులకు కాల్‌ సెంటర్‌ కూడా ఏర్పాటు చేశాం పెద్దిరెడ్డి వివరించారు.

మరిన్ని వార్తలు