జగన్‌ పాలన చూసి ఆకర్షితులవుతున్నారు 

13 Aug, 2022 03:59 IST|Sakshi
టీడీపీ నాయకులు, కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పుంగనూరు తెలుగుదేశం నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరిక  

పుంగనూరు: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన చూసి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారని రాష్ట్ర ఇంధన, అటవీ, గనులశాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. చిత్తూరు జిల్లా పుంగనూరు భగత్‌సింగ్‌కాలనీలో శుక్రవారం రాత్రి వైఎస్సార్‌సీపీ జిల్లా జనరల్‌ సెక్రటరీ జయకృష్ణ, కౌన్సిలర్‌ జయభారతి ఆధ్వర్యంలో 55 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీలో చేరిన దామోదర్‌రెడ్డి, సురేంద్రరెడ్డి, కృష్ణయ్య, రమేష్, చంద్రకళరెడ్డి, నందినిరెడ్డి, రాధారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, వెంకటరెడ్డి, కృష్ణారెడ్డి, ఖాదర్‌బాషా, ఇర్ఫాన్, సలీం, బాబు, షబ్బీర్, గణేష్‌ తదితరులకు మంత్రి పెద్దిరెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప పార్టీ కండువాలు వేశారు.

ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కులమతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తోందని చెప్పారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకు అధికారులు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు. పార్టీలో చేరిన వారందరికీ తగిన గుర్తింపు ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్, పార్టీ పుంగనూరు పట్టణ అధ్యక్షుడు ఇప్తికార్, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు